రాజ్యసభకు త్వరలో జరుగనున్న ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి తన అభ్యర్ధులను ప్రకటించింది. తెలంగాణ నుంచి పెద్దల సభకు ఇద్దరు సభ్యులను ఎన్నుకోవాలి. వీరిద్దరిలో ఒకరు డి.శ్రీనివాస్, మరొకరు కెప్టెన్ లక్ష్మీకాంతరావు. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్ధానంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్ధానాన్ని ఫరీదుద్దీన్ ను ఎంపిక చేశారు.
తనను, పార్టీని నమ్ముకున్న వారికి ఎలాంటి అన్యాయం జరగదని, అనుకున్న సమయంలో వారికి పదువులు లభిస్దాయని వీరి ఎన్నిక ద్వారా పార్టీ అధ్యక్షుడు మరోసారి నిరూపించుకున్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ కు తప్ప మిగిలిన ఏ పార్టీకి తగిన బలం లేకపోవడంతో రాజ్యసభ సభ్యుల ఎంపిక లాంఛనమే అవుతుంది.
పెద్దల సభకు వెళ్తున్న ఇద్దరిలో ఒకరు కెసిఆర్ కు ఆత్మీయుడు. ఆయనే కెప్టెన్ లక్ష్మీకాంతరావు. మరొకరు పిసిసి అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసిన డి.శ్రీనివాస రావు. ఈయన విశ్వసనీయతే ఈయనకు పదవి దక్కేలా చేసింది. ఇక ఎమ్మెల్సీ విషయానికి వస్తే ఫరీదుద్దీన్ మెదక్ జిల్లాకు చెందిన నాయకుడు. మైనార్టీల కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు.