కరోనా కారణంగా తిరుమలలో సర్వదర్శనాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. కేవలం రూ. 300 టికెట్లు ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారికే మాత్రమే ప్రస్తుతం దర్శనభాగ్యం కలుగుతోంది. ఈ క్రమంలో నిరుపేద భక్తులు స్వామివారిని దర్శించుకోలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్నది. ఏపీలోనూ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వం ఆంక్షలను సైతం సడలించింది. ఈ క్రమంలో తిరుమలలో కూడా సర్వ దర్శనాలకు అనుమతి ఇవ్వాలని టీటీడీ భావిస్తున్నట్టు సమాచారం.
ఆగస్ట్ నెల నుంచి సర్వ దర్శనాలు ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ.. టీటీడీ ఆగస్ట్ నుంచి సర్వ దర్శనాలకు అనుమతి ఇస్తుందని అనధికారికంగా సమాచారం అందుతోంది. కరోనా పాజిటివిటీ రేటు ఒక్క శాతానికి వస్తే దర్శనాలకు అనుమతి ఇవ్వాలని టీటీడీ యోచిస్తోందట. గతేడాది 2020 మార్చి 20 నుంచి స్వామి వారి సేవలు టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2020 జూన్ 7నుంచి రోజుకు 5 వేల మందితో ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ఆన్లైన్ ద్వారా టికెట్లు జారీ చేసి దర్శనాలు ప్రారంభించింది.
కరోనా మొదటి వేవ్ అనంతరం కొంతకాలం సర్వ దర్శనాలకు అనుమతి ఇచ్చినప్పటికీ ఆ తర్వాత మళ్లీ కేసులు పెరగడంతో టీటీడీ సర్వ దర్శనాలను నిలిపివేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరుమల దేవస్థానంలో దర్శనాలకు అనుమతి ఇస్తారేమోనని భక్తులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు టీటీడీకి కూడా ఈ మేరకు విజ్ఞప్తులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో, మెయిల్స్ ద్వారా విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో టీటీడీ సర్వ దర్శనాలు ప్రారంభానికే మొగ్గు చూపినట్టు సమాచారం.
Also Read
ద్రాక్షగుత్తి రూ. 7లక్షలు..! అంత స్పెషల్ ఏమిటంటే..!