జాతీయపార్టీల సంగతేమోగాని ఓ ప్రాంతీయపార్టీ రెండు రాష్ట్రాల్లో ఉంటే… ఎంత ఇబ్బందో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని చూస్తే అర్ధమైపోతుంది. అందులోనూ ఒకచోట అధికారపక్షంగా మరో రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉంటే ఆ సమస్యలు మరింత ఎక్కువన్న విషయం కూడా తెలుస్తోంది.
ఇక ఒక రాష్ట్రం నుంచి విడిపోయి నీళ్లకోసం పోటీపడుతున్న తెలుగురాష్ట్రాల్లో టిడిపి ఒక పార్టీ రెండు ధోరణులు అన్నసూత్రంతో ముందుకు సాగుతున్న నేపధ్యంలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లో ఉన్న పార్టీ నేతలు ఎంత సమన్వయంగా ఉండాలి. రెండుచోట్లా ఇబ్బందులు రాకుండా ఎంత జాగ్రత్తపడాలి. కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం ఆ సమన్వయలోపం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
విభజన తర్వాత రెండు తెలుగురాష్ట్రాలు పరస్పరం కొన్ని వివాదాలతో సతమతమవుతున్నాయి. వాటిలో నీటి కేటాయింపులు కూడా ఒకటి. ఆంధ్రా ప్రాంత నేతలు తెలంగాణ నీటిని ఇప్పటిదాకా దోచుకున్నారు అని తెలంగాణ ఆరోపిస్తుంటే… తెలంగాణ కట్టబోయే ప్రాజెక్టులు అన్యాయం, అక్రమం అని ఆంధ్రా అంటోంది. పరస్పరం అక్కడ ఇక్కడ మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలు వచ్చాయి. అక్కడ టి.టిడిపి పోటీచేయడం లేదు. కానీ… కెసిఆర్పై, టిఆర్యస్పై ఉన్న కక్షతో కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చి గెలిపించే బాధ్యత తీసుకుంది. టి.టిడిపి తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇలాంటప్పుడు సీమాంధ్రకు చెందిన అధికారపార్టీ నేతలు ఎలా ఉండాలి. ఎన్నికలయ్యేవరకైనా తమ పార్టీ మద్దతునిస్తున్న పార్టీని గెలిపించేందుకు తమకు వీలైనంత సాయం చేయాలి. సాయం చేయలేకపోతే… కనీసం ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. కానీ… ఈ సమయంలోనే ఆంధ్రాలో టిడిపికి చెందిన మంత్రులే తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలంటూ మాట్లాడుతుండడం టి.టిడిపిని ఇబ్బంది పెడుతోంది.
అసలే తెలుగుదేశం పార్టీని తెలంగాణకు బద్ధ శత్రువుగా చూపించేందుకు టిఆర్యస్ వీలైనన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల ప్రచారంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు రేవంత్రెడ్డి ఆంధ్రాలో అధికారంలో ఉన్న తమ పార్టీ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ… రేవంత్ పడుతున్న ఈ కష్టాన్ని గమనించకుండా ఎపి మంత్రి బొజ్జల తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుకోవాలని వ్యాఖ్యలు చేయడం ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించింది. ఈయనేమో తెలంగాణ ప్రాజెక్టులకు మేం వ్యతిరేకం కాదంటారు… ఆయనేమో తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలని కామెంట్లు చేస్తారు. దాంతో పాలేరు నియోజకవర్గ జనాలు టిడిపి అంటే తెలంగాణ వ్యతిరేక పార్టీ అనే టిఆర్యస్ వాదనే కరెక్టేమో అని అభిప్రాయపడుతున్నారు. దీనిపై రేవంత్రెడ్డి కూడా స్వంత పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలయ్యేవరకూ ప్రాజెక్టులపై ఏ కామెంట్ల చేయకుండా ఆగుదామనే కనీస సెన్స్ కూడా లోపించిందని మండిపడుతున్నారట. సమన్వయలోపం అంటే ఇదే కాదూ!