ఇండియాలో నరమేధం సృష్టిస్తున్న కరడుగట్టిన ఉగ్రనేత, జైషే మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజహర్ పై అంతర్జాతీయంగా భారత్ ఘనవిజయం సాధించింది. గత కొన్ని సంవత్సరాలుగా మసూద్ అజహర్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న భారత్ కల నెరవేరింది. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకరుండా ఐరాసాలో చైనా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఐరాసాలో శాశ్వత సభ్యుదేశాలయిన అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండు ఒత్తి డితో తలొగ్గింది. దీంతో ఐరాసా మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.
ఇన్నాళ్లూ తనకున్న వీటో పవర్ తో మసూద్ అజహర్ ను కాపాడుకొచ్చిన చైనా ఈసారి ఎలాంటి అడ్డుపుల్లలు వేయకుండా, గతంలో తాను వ్యక్తం చేసిన అభ్యంతరాలను సైతం వాపసు తీసుకుంది. మరోవైపు, పాకిస్థాన్ కూడా మసూద్ అజహర్ పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.
తాజా ప్రకటన అనంతరం మసూద్ అజహర్ ను నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చుతున్నట్టు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ వెల్లడించారు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంతో పాక్ వెలుపల మసూద్ ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించలేడు. అంతే కాదు విదేశాల్లో ఉన్న అతని ఆస్తులు జప్తు చేసే వీలుండడంతోపాటు, అతడి ఆర్థిక కార్యకలాపాలకు కూడా తీవ్ర విఘాతం ఏర్పడనుంది. ఏ దేశ ప్రభుత్వమైనా మసూద్ అజహర్ పై చర్యలు తీసుకునే వీలుంటుంది.