ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ప్రత్యేకత చాటుతున్నాడు. ఐటీ శాఖలో అద్భుతమైన ప్రణాళికలు చేపడుతూ.. సంస్కరణలు తీసుకొస్తూ కేటీఆర్ ఐటీకి కేరాఫ్ అడ్రస్గా హైదరాబాద్ను నిలపడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. అంతర్జాతీయంగా ఐటీకి కేంద్రగా హైదరాబాద్ ఉండడానికి కార్యక్రమాలు చేపడుతున్నారు. అవి విజయవంతమవడంతో అంతర్జాతీయ వేదికల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మొన్న ట్రంప్ కూతురు ఇవాంక వచ్చి ప్రశంసలు కురిపించగా ఇప్పుడు ఆ దేశానికి చెందిన చట్టసభల ప్రతినిధుల బృందం మంత్రి కేటీఆర్ పనితీరును అభినందించారు.
భారతదేశ పర్యటనలో అమెరికా చట్టసభల బృందం సభ్యులు టెర్రీ సీవెల్, డీనా టీటస్ ఉన్నారు. అందులో భాగంగా తెలంగాణలో రెండో రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీహబ్లో వీహబ్కు సంబంధించిన ప్రత్యేక చర్చాగోష్టిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీహబ్ సీఈఓ దీప్తి రావుల వీహబ్ లక్ష్యాలను వివరించారు.
మహిళల స్వావలంబన, సృజనాత్మకకు ఇస్తున్న ప్రోత్సాహంపై అమెరికాకు చెందిన చట్టసభల ప్రతినిధి బృందం ప్రశంసలు కురిపించింది. వీహబ్ ప్రశంసనీయం అని కీర్తించారు. అమెరికా బృందం టీ హబ్, వీ హబ్పై ప్రశంసలు గుప్పించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీహబ్ ఏర్పాటు చేయడం వినూత్న, పురోగామి నిర్ణయమని అమెరికా చట్టసభల సభ్యులు డీనా టీటస్, టెర్రీ స్వీవెల్ పేర్కొన్నారు. భారతదేశానికి మొదటి సందర్శనలోనే మహిళలకు సంబంధించి ముఖ్యమైన అడుగు వేసిన రాష్ట్రంలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘మహిళలు గెలిస్తే అమెరికా గెలిచినట్లే’ అనేది తమ డెమోక్రటిక్ పార్టీ స్లోగన్, తెలంగాణ ప్రభుత్వ అడుగులు అదే రీతిలో ఉన్నాయని కితాబు ఇచ్చారు. టీహబ్, వీహబ్ అభివృద్ధి పథంలో సాగాలని ఆమె ఆకాంక్షించారు.