టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ అకౌంట్ను వాట్సాప్ బ్లాక్ చేసింది. ఔను మీరు చదివింది నిజమే.. ఓ ఎంపీ, పారిశ్రామికవేత్త, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ అకౌంట్ను బ్లాక్ చేసింది వాట్సాప్. ఇంకకేప్పుడు తమ సేవలు వినియోగించుకోలేరు అంటూ తెలిపింది. మీరు నియమ నిబంధనలు ఉల్లంఘించారని తెలిపింది. గత కొన్ని రోజులుగా అసాంఘిక కార్యకలాపాలకు తమను వేదికగా వాడుకుంటున్నవారి ఖాతాను స్తంభింపజేస్తామంటూ గతంలో వాట్సాప్ సంస్థ ప్రకటిస్తూనే ఉంది. ఇప్పుడు ఇదే కారణాన్ని చూపుతూ ఆయన వాట్సాప్ను బ్లాక్ చేసింది.
కొన్ని రోజులుగా సీఎం రమేశ్ వాట్సాప్ అకౌంట్ పనిచేయడం లేదు. దీంతో ఆయన వివరణ కోరుతూ వాట్సాప్ సంస్థకు ఓ మెయిల్ పెట్టారు. వారి నుంచి వచ్చిన స్పందన చూసి ఆయన షాక్ అయ్యారనే చెప్పాలి. నిబంధనలు ఉల్లంఘించారంటూ మీ వాట్సాప్ ఖాతాపై ఫిర్యాదులు అందాయని.. అది నిజమేనని విచారణలో తేలడంతో ఖాతాను నిలిపివేశామని లేఖలో వాట్సప్ ప్రతినిధులు రిప్లై ఇచ్చారు.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వివిధ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల అకౌంట్లపై వాట్సాప్ నిఘా పెట్టింది. ఎంపీగా ఉన్న ఓ వ్యక్తిపై ఇలా చర్యలు తీసుకున్నారంటే దీని వెనుక పెద్ద కారణమే ఉంటుందని అంటున్నారు నిపుణులు.
ఇంతకీ సీఎం రమేశ్ వాట్సాప్ అకౌంట్ పై ఎవరు ఫిర్యాదు చేసింది ఎవరు? అనేది తెలాల్సి ఉంది. ఏ ఒక్కరో ఫిర్యాదు చేస్తే వాట్సాప్ ఇలా చర్యలు తీసుకోదు. చాలా ఫిర్యాదులు వస్తేనే ఇంతటి చర్యలకు పూనుకుంటారని నిపుణులు చెబుతున్నారు. అసలు కారణం ఏంటో మరికొన్ని రోజుల్లో తేలనుంది.
ఇదిలా ఉంటే ఈ విషయాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేశారు సీఎం రమేష్. తన ఖాతా స్తంభన వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు.