ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. టీడీపీ పార్టీనుంచి ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. తాజాగా పార్టీకి ఉత్తరాంధ్రలో మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో ప్రాధాన్యం దక్కని ముఖ్యమైన నాయకులు జగన్ పార్టీలో చేరుతున్నారు. చీరాల ఎమ్మెల్యే వైసీపీలో చ ఏరకముందే..ఇప్పుడు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకీ రాజీనామా చేశారు. దీంతో టీడీపీలో వలసలపై తీవ్ర చర్చ జరుగుతోంది.
అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానంపై గత కొంత కాలంగా గుర్రుగా ఉన్నారు. పార్టీ ప్రాధాన్యత తగ్గడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అవంతి శ్రీనివాస్ వచ్చే ఎన్నికలో అసెంబ్లీకి.. అదీ భీమునిపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కొంతకాలం కిందట పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వద్ద ప్రస్తావించారు. అయితే ఆయన మాత్రం మరోమారు తాను భీమిలి నుంచే పోటీ చేస్తానని స్పష్టంగా ప్రకటించారు. ఈ నేపథ్యం లో ముత్తంశెట్టి విశాఖ నార్త్ లేదా చోడవరం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు కొద్దికాలంగా వినిపిస్తున్నాయి. అక్కడనుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస్ ఉన్నారు. టికెట్పై బాబు తేల్చకపోవడంతో విసుగుచెంది పార్టీకి రాజీనామా చేశారు.
అవంతి త్వరలో ఫ్యాన్ గూటికి చేరుకోనున్నారు. దీనిలో భాగంగా గురువారం సాయంత్రం 4 గంటలకు లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత అవంతి పార్టీకి అందుబాటులో లేకుండాపోయారు. ఫోన్ కూడా స్విచ్ఛాప్ పెట్టినట్లు సమాచారం. ఇకపోతే అటు విశాఖపట్నంలోని ఆయన నివాసం దగ్గర తెలుగుదేశం పార్టీ జెండాలను సైతం తొలగించినట్లు సమాచారం. ఇకపోతే ప్రభుత్వం కేటాయించిన ఇద్దరు గన్ మెన్లను సైతం వెనక్కి పంపించినట్లు సమాచారం. అవంతి భీమిలీ నుంచి పోటీ చయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ భీమిలి టికెట్ పై హామీ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.జగన్ ను కలిసిన తర్వాత అవంతి శ్రీనివాస్ తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చెయ్యనున్నట్లు సమాచారం. 24న విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైసీపీ సమర శంఖారావం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో అవంతి శ్రీనివాస్ అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని సన్నిహితులు చెప్తున్నారు.