ఏపీసీఎం చంద్రబాబు నాయుడిపై భాజాపా ఎమ్మెల్సీ సోమువీర్రాజు విరుచుకుపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం నుంచి బాత్రూం వరకు టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. భోగాపురం మిమానాశ్రయం నిర్మాణ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాకు ఫిర్యాదు చేశారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ టెండర్ల వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వం పెద్దు ఎత్తున అవినీతికి పాల్పడిందన్నారు. మొదట కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను దక్కించుకొంది. తర్వాత ఆ టెండర్లను ప్రభుత్వం రద్దు చేయడంపై సోము వీర్రాజు మండిపడ్డారు.
టెండర్ల రద్దుపై అవకతవకలు చోటు చేసుకొన్నాయని సోము వీర్రాజు ఆరోపించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు టెండర్ దక్కితే పనులు అప్పగించకుండా టెండర్ రద్దు చేయడంపై వీర్రాజు అనుమానాలను వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రి జయంత్సిన్హాను ఎమ్మెల్సీ సోము వీర్రాజు కోరారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ టెండర్ రద్దు విషయమై విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఈ విషయమై కేంద్ర మంత్రిని సోము వీర్రాజు కలిసి ఫిర్యాదు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
ఎయిర్పోర్ట్ చుట్టు పక్కల ఉన్న భూములు కొట్టేయడానికే ఆ సంస్థ టెండర్లను చంద్రబాబు రద్దు చేశారన్నారు . రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ముడుపులు తీసుకోవచ్చని ఈ టెండర్లను ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. యిర్పోర్ట్ వ్యయాన్ని రూ.2వేల కోట్ల నుంచి 4వేల కోట్లకు చంద్రబాబు పెంచారని దుయ్యబట్టారు.ఈ టెండర్ల వ్యవహారంలో చోటుచేసుకున్న అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టేలా కోర్టులో పిటీషన్లు వేస్తామన్నారు.
ఈ విషయమై కేంద్రం ఏ రకంగా వ్యవహరిస్తోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరో వైపు బీజేపీ, టీడీపీల మధ్య ఇటీవల కాలంలో మాటల యుద్దం సాగుతోంది. అవకాశం దొరికితే రెండు పార్టీల నేతలు ఒకరిపై మరోకరు విరుచుకుపడుతున్నారు.