రాజకీయాల్లో ఇప్పటి వరకు ఎన్నో వింతలూ విశేషాలు జరిగాయి. తాజాగా కేరళకు చెందిన ఆర్యా రాజేంద్రన్ అనే 21 ఏళ్ల యువతి దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. తిరువనంతపురం మేయర్ పీఠాన్ని అధిరోహించి దేశాన్ని తనవైపు తిప్పుకున్నారు. కేవలం 21 సంవత్సరాలు. చదువుతున్నది బీఎస్సీ రెండో సంవత్సరం.
దక్కిన పదవి కీలకమైన నగరానికి మేయర్. కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్గా ఆర్య రాజేంద్రన్ అనే విద్యార్థిని పేరు ఖరారైంది. త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. దాంతో దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్గా ఆర్య రాజేంద్రన్ రికార్డుల్లోకి ఎక్కనున్నారు. సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు.
తిరువనంతపురం ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. ప్రస్తుతం తన చదువును కొనసాగిస్తోన్న ఆర్యా.. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు సేవ చేయడంతోపాటు తన చదువును కొనసాగిస్తానని తెలిపారు. ఆర్య తండ్రి రాజేంద్రన్ ఎలక్ట్రీషియన్, తల్లి ఎల్ఐసీ ఏజెంట్.