తిరుమల దర్శనానికి వచ్చిన భాజాపా ఛీఫ్ అమీత్షాపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడి ఘటనపై భాజాపా-టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అమిత్ షా కాన్వాయ్పై రాళ్లదాడి జరిగిన ఘటన దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తమ కార్యకర్తలను బీజేపీ నేతలే రెచ్చగొడుతున్నారని అన్నారు. బీజేపీ నేతలు ఏపీపై చేస్తోన్న వ్యాఖ్యలను కర్ణాటక ప్రజలు కూడా గమనిస్తున్నారని, ఆ పార్టీకి బుద్ధి చెబుతారని అన్నారు.
టీడీపీ నేతల మాటలకు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు భాజాపా నేతలు. దాడి ఘటనపై హోమంత్రి చినరాజప్ప, చంద్రబాబు చెరోకలా స్పందించారన్నారు. అందుకే టీడీపీని తాను తెలుగు డ్రామా పార్టీగా పిలుస్తానని తెలిపారు భాజాపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు. అమిత్ షాపై దాడి చేసిన తెలుగుదేశం గూండాలను జైళ్లలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక చంద్రబాబు ఉన్నారని… ఆయన డైరెక్షన్ లోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు.
బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టే పనిని టీడీపీ చేస్తోందని వీర్రాజు అన్నారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిపై దాడి జరగడమంటే మామూలు విషయం కాదని… రోప్ పార్టీని కూడా దాటుకుని టీడీపీ కార్యకర్తలు చొచ్చుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. తిరుపతికి వచ్చే వారిని అతిథులుగా గౌరవించాలని, రాజకీయ దురుద్దేశంతోనే టీడీపీ నేతలు దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లూ టీడీపీ అవినీతిలో మాత్రమే కూరుకుపోయిందనుకున్నాం కానీ, ఆ పార్టీ గూండాలతో నిండిపోయిందని ఇప్పుడు తెలిసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.