పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే పలువురు రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార పార్టీ నేతలు దీనిపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ సైతం.. ఎన్నికల యాప్ గురించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని కోరింది. ఈమేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి ఓ ట్వీట్ చేశారు.
యాప్ వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరమేమిటో చెప్పాలని ఎస్ఈసీని ట్విటర్లో ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం లాగా ఈ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను మీరు పరిగణనలోకి తీసుకుంటారా? సహజంగా ఇలాంటి వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వ అదీనంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ గానీ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగం గానీ నిర్వహిస్తుంటుంది. మరి ఈ ప్రత్యేక యాప్ను ఎవరు తయారు చేశారు?
ఈ యాప్ విషయాలను ఎందుకు రహస్యంగా ఉంచారు? ఇది ఎన్నికల సెల్ పర్యవేక్షణలో తయారైందా? లేదా? అనే విషయం ప్రకటిస్తే ఇంకా మంచిది. ఇది ఒక రాజకీయ పార్టీ తయారు చేసిన యాప్ అంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. వాస్తవమేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద ఉంది’ అని విష్ణువర్ధన్రెడ్డి పేర్కొన్నారు.
మేం పోటీ చేయం అంటూన్నా టీడీపీ నాయకులు
బూటకపు ఎన్నికలను బహిష్కరించండి