వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి తాను రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనిసంకల్పించారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టలో పిటిషన్ వేశారు. అయితే జగన్ పాదయాత్రకు అనుమతి ఇస్తుందా లేకుంటె నిరాకరిస్తుందా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా పాదయాత్రలు చేయరు అనేది తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఈ కేసుల విచారణకు కేవలం ఆరునెలలు వ్యక్తిగత హాజరు మినహాయింపు మాత్రమే జగన్ కోరారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు అనుమతి వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది న్యాయనిపుణుల్లో చర్చనీయాంశంగా ఉంది.
గతంలో పాదయాత్ర చేడానికి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. అసలు పాదయాత్ర అనేదే స్వప్రయోజనాల కోసం చేస్తున్నట్టుగా ఉన్నదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోర్టు తప్పు పట్టినంత మాత్రాన జగన్ తన ప్రయత్నాన్ని మానుకోలేదు. సంకల్పాన్ని మార్చుకోలేదు.
అలాగని న్యాయవిచారణ నుంచి తప్పుకోవాలని కూడా అనుకోలేదు. కేవలం ఆరునెలలు వ్యక్తిగత హాజరు మినహాయింపు మాత్రం ఇస్తే చాలునంటూ తాజాగా తన కేసులను విచారిస్తున్న సీబీఐ కోర్టులో ఆయన పిటిషన్ వేశారు. తనకు మినహాయింపు ఇవ్వడం వలన న్యాయవిచారణకు ఎలాంటి ఆటంకం ఏర్పడదని.. విచారణ పర్వం మొత్తం యథాతథంగా సాగవచ్చునని జగన్ పేర్కొన్నారు. తన గైర్హాజరీ కారణంగా కేసు వాయిదాను న్యాయవాది కోరబోరు అని కూడా జగన్ హామీ ఇచ్చారు.
అయితే పాదయాత్రకు అనుమతి ఇవ్వాలా లేదా అన్నది న్యాయమూర్తుల విచక్షణాధికారానికి లోబడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జగన్ తరఫు న్యాయవాది వాదనల సమయంలో ఇలా కోరితే అనుమతి రావడానికి అవకాశం పెరుగుతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఆరునెలలు తాత్కాలిక విరామం కోరడంతో పాటు… మధ్యలో ఎప్పుడైనా సరే .. తన వ్యక్తిగత హాజరు తప్పనిసరి అని కోర్టు భావించేట్లయితే.. తాను ఆ వాయిదాకు తప్పకుండా హాజరవుతానని కూడా జగన్ తరఫున న్యాయవాది హామీ ఇస్తే గనుక.. కోర్టు అనుమతి వచ్చే అవకాశం ఇంకా పెరుగుతుందని కూడా వారు అంటున్నారు. ఇది ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.