కాంగ్రెస్లో టికెట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది. ఒక పక్క కూటమి…మరో పక్క సొంత పార్టీనేతల తీరుతో అధిస్టానం దిక్కుతోచని స్థితిలో ఉంది. తాజాగా అధిష్టానానికి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి ఫైర్ అయ్యారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకు కాకుండా వేరెవరికైనా ఇస్తే నల్గొండలో పోటీ నుంచి తాను తప్పుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్ చేశారు.
తర్వాత జరగబోయే పరిణామాలకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి విచ్చేసిన కోమటిరెడ్డిని శుక్రవారం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 94 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది. మిత్రపక్షాలకు 26 స్థానాలను కేటాయించనుంది. సీపీఐకు 3, టీజేఎస్కు 8, టీడీపీకి 14, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక్క సీటును కేటాయించనుంది. కొత్తగా ప్రజా కూటమిలో చేరిన తెలంగాణ ఇంటి పార్టీకి కూడ ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించనుంది. తెలంగాణ ఇంటి పార్టీ నకిరేకల్ స్థానాన్ని కోరే అవకాశం ఉంది.
నకిరేకల్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను బరిలోకి దింపాలని భావిస్తోంది. చిరుమర్తి లింగయ్య ప్రచారాన్ని కూడ ప్రారంభించారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.