కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం గట్టి షాక్ ఇచ్చింది. రెండు జాబితాల్లో తన అనుచరులకు టిక్కెట్లు దక్కలేదని ఆగ్రహంతో ఉన్నరేవంత్ రెడ్డి మూడో జాబితా పుండు మీద కారం చల్లినట్లైంది. మూడో జాబితాలో కూడా రేవంత్ అనుయాయులకు టికెట్ల కేటాయింపు లేకపోవడంతో గర్రుగా ఉన్నారు.
తనతోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ నేతలకు టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే రేవంత్ రెడ్డి కండీషన్ పెట్టారు. అయితే మహాకూటమి పొత్తులో భాగంగా రేవంత్ అడిగిన సీట్లు కేటాయించడం అసాధ్యమైంది. నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి టికెట్లను ఆయన ఆశించారు. తనతోపాటు కాంగ్రెస్లో చేరిన నిజామాబాద్, కామారెడ్డి టీడీపీ అధ్యక్షులు అరికెల నర్సారెడ్డిని, సుభాష్ రెడ్డిలను ఈ నియోజకవర్గాల నుంచి బరిలోకి దించాలని రేవంత్ ఆశించారు.
అయినప్పటికీ కాంగ్రెస్ ఆ సీట్లను సీనియర్ నేతలకు కేటాయించింది. ఎల్లారెడ్డి- జాజల సురేందర్, నిజామాబాద్ రూరల్ నుంచి రేకుల భూపతిరెడ్డిలను బరిలోకి దింపింది. నిజామాబాద్ రూరల్, బాల్కొండ స్థానాలు ఆశించిన టీడీపీకి కూడా కాంగ్రెస్ మొండిచేయి చూపింది.
అటు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సూర్యాపేట నియోజకవర్గం నుంచి తన అనుచరుడు పటేల్ రమశే రెడ్డికి టిక్కెట్ ఇస్తుందని ఆశించారు. అది కూడా ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తనకు తీవ్ర అన్యాయం జరిగిందని అనుచరుల వద్ద వాపోతున్నారట. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలలో టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఆ జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్యే పోటీ నెలకొంది.