ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పార్టీ అవతరించబోతోంది. సీబీఐ మాజీ జేడీ, మహారాష్ట్ర క్యాడర్ మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ కొత్త పార్టీనీ స్థాపించనున్నారు. నవంబరు 26న ప్రకటన చేయనున్న ఆయన, ఆ రోజే పార్టీ జెండా, అజెండాల గురించి వివరించనున్నారు. జగన్ కేసులను టేకప్ చేసి తన కంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు.
వైసీపీ అధినేగ జగన్, సత్యం కంప్యూటర్స్, గాలి జనార్దన్రెడ్డిల అక్రమాల కేసులపై దర్యాప్తులతో లక్ష్మీనారాయణ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత మహారాస్ట్రకు బదిలీ అయ్యారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేశాక ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటించారు. రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన వెంటనే గ్రామాలను సందర్శించి నేరుగా రైతులను కలుసుకుని, వారి ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. అలాగే, కాలేజీలకు కూడా వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారిని చైతన్యపరిచారు.
ఆయన జనసేన, టీడీపీ, బీజేపీలలో ఏదో ఒక పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సేవ చేస్తానని ప్రకటించారు. వేరే పార్టీలో చేరుతారనే ఊహాగానాలకు తెరదించుతూ సొంతంగానే పార్టీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వ్యవవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలే ప్రధాన అజెండాగా ఆయన పార్టీ ఉండనుందని సమాచారం.
ఈ నెల 26న కొత్త పార్టీ పేరును ప్రకటించి.. లక్ష్యాలు, అజెండాను లక్ష్మీనారాయణ ప్రజలకు వివరిస్తారని సమాచారం. కడప జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. సీబీఐ జాయింట్ డైరెక్టర్గా జగన్ అక్రమాస్తుల కేసును అప్పట్లో పరుగులు పెట్టించారు.