సామాన్యులకు రైలు ప్రయాణం ఎంతగా ఉపయోగ పడుతుందో కొత్తగా చెప్పనక్కరలేదు. అయితే రైలు ప్రయాణం అంటే రిస్కీ.. అక్కడ అంతగా కంఫర్ట్ గా ఉండదని కొందరు అంటారు.. కానీ ప్రయాణాలు మాత్రం మానుకోరు. తాజాగా రైల్వే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తూ, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు రైల్వే శాఖ కృషి చేస్తోంది. భారతీయ రైల్వేశాఖ ప్రవేశపెట్టిన విస్టాడోమ్ టూరిస్ట్ కోచ్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
దీనికి సంబంధించిన స్పీడ్ ట్రయల్ కూడా సక్సెస్ అయ్యింది. రైల్వే బోగీలోని ఫెసిలిటీస్ను చూసి రైల్వే ప్రయాణికులు ఫుల్ ఫిదా అవుతున్నారు. ఈ బోగీలో ఎప్పుడెప్పుడు జర్నీ చేయాలా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. రైళ్లలోని సదుపాయాలను తెలుపుతూ రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ఓ వీడియో షేర్ చేశారు.
ప్రయాణాలను మన జ్ఞాపకాల్లో కొలవాలి, అంతేగానీ మైళ్లలో కాదంటూ ఆయన అన్నారు. ‘భారతీయ రైల్వే తయారు చేస్తున్న కొత్త విస్తాడోమ్ బోగీలు ఇవీ..’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. వీటిలో ప్రయాణిస్తే కచ్చితంగా మర్చిపోలేని అనుభవాన్ని పొందుతారని ఆయన తెలిపారు.
ఒక్కొక్క విస్టాడోమ్ కోచ్లో 44 సీట్లు ఉంటాయి. ప్రతి సీటు 180 డిగ్రీలు తిరిగే విధంగా ఏర్పాటు చేశారు. దాదర్-మడగావ్, అరకు లోయ, కశ్మీర్ లోయ, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, కల్కా షిమ్లా రైల్వే, కంగ్రా వ్యాలీ రైల్వే, మాథేరన్ హిల్ రైల్వే, నీలగిరి మౌంటేన్ రైల్వే ప్రాంతాల్లో విస్టాడోమ్ కోచ్లను నడపనున్నారు.