జనసైనికుల్లో నైరాశ్యం.. ఉవ్వెత్తున ఎగిసిపడడం.. మళ్లీ చప్పున చల్లారడం పవన్ కళ్యాణ్ కు అలవాటు. రాజకీయాలను పార్ట్ టైంగా చూసుకుంటూ పవన్ కళ్యాణ్ తన ప్రతిష్టను పోగొట్టుకుంటున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ మళ్లీ సైలెంట్ అవ్వడాన్ని జనసైనికులు తట్టుకోలేకపోతున్నారు.
ఎన్నికలకు ముందు కూడా 10 రోజులు విస్తృతంగా ప్రచారం చేసి వార్తల్లో నిలిచి పవన్ మరో 15 రోజుల పాటు కనిపించకుండా పోయేవారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా ఓటమిపై రివ్యూ చేసి మన టార్గెట్ ఐదేళ్లు కాదు.. 25 ఏళ్లు పాలిటిక్స్ లో ఉండి అధికారమే లక్ష్యంగా పనిచేస్తానని పవన్ స్పష్టం చేశారు.ఈ ఓటమితో కృంగిపోనని చెప్పాడు. వచ్చే పదేళ్లలో జనసేనను ఏపీలో అధికారంలోకి తీసుకొస్తానని స్పష్టం చేశాడు.
అయితే పవన్ లాగానే ఆయన అభిమానులు పవన్ యాక్టివ్ గా ఉంటారని ఆశించారు. పవన్ క్యాడర్ లో ఎక్కువగా కాపు నేతలు, కాపు యువతే ఉన్నారు. ఇప్పుడు వారు కూడా పవన్ మౌనముద్రను జీర్ణించుకోలేని పరిస్థితి. జనసేనలో యాక్టివ్ గా ఉండలేకపోతున్న స్థితి నెలకొంది.
అమెరికా తానా సభలకు హాజరైన పవన్ అక్కడ కసిగా మాట్లాడారు. ప్రజల కోసం పోరాడుతానని ప్రతిజ్ఞ చేశాడు. 25 సంవత్సరాల దూరదృష్టితో రాజకీయాల్లోకి వచ్చానని.. అధికారం కోసం కాదు అని.. యాక్టివ్ పాలిటిక్స్ చేస్తానన్నారు. కానీ అమెరికా తానా సభలు ముగిశాక పవన్ కనిపించింది లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. పవన్ ప్రస్తుతం అందరికీ దూరంగా ఉన్నారు. అయితే పార్టీ అన్నాక ఎప్పుడూ యాక్టివ్ గా ఉండాలి. ప్రజల్లో తిరగాలి. అప్పుడే విజయాలు దక్కుతాయి. కానీ పవన్ ఇలా పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేయడాన్ని జనసైనికులు జీర్ణించుకోవడం లేదు. పవన్ ఎప్పుడు ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉంటాడో అని మథన పడుతున్నారట…