వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతామని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకేసి ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ప్రకటించారు. ఎన్నికల్లో మొట్టమొదటి బీఫారం పితాని బాలకృష్ణకు కేటాయిస్తానని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం స్థానం నుంచి పితాని బాలకృష్ణ ఏపీ అసెంబ్లీకి పోటీ చేయనున్నారు.
తనపై నమ్మకంతో పితాని జనసేనలోకి వచ్చారని, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదని పవన్ వివరించారు.పితాని బాలకృష్ణ కానిస్టేబుల్ గా చేశారని, తన తండ్రి కూడా కానిస్టేబుల్ ఉద్యోగం చేశారని, తమది ‘పోలీస్ కులం’ అని చెప్పి నవ్వులు చిందించారు. పితాని బాలకృష్ణను ‘జనసేన’ మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.
జనసేన పార్టీ తొలి టిక్కెట్ ప్రకటించడంతో ఇతర పార్టీలు సైతం అప్రమత్తమయ్యాయి. అన్ని పార్టీలు రాజకీయ సమీకరణాలను అంచనా వేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రమంతా తిరిగేస్తున్న పవన్ కళ్యాణ్ పర్యటన పూర్తయ్యే లోపు అభ్యర్థులను ఖరారు చేస్తారన్న ప్రచారం ఉంది. మరోవైపు పార్టీ టిక్కెట్ ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతారని పరోక్షంగా సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది.