మక్కల్ నీది మయ్యం (ప్రజా న్యాయ వేదిక)
తమిళ అగ్ర నటుడు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేశారు. ఆయన బుధవారం (ఫిబ్రవరి 21) మధురైలో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ పేరు, పార్టీ విధివిధానాలు, గుర్తు, జెండా ప్రకటించారు. తన పార్టీ పేరు ‘మక్కల్ నీది మయ్యం (ప్రజా న్యాయ వేదిక)’ పాల్గొన్న లక్షలాది ప్రజల ఎదుట వెల్లడించారు. అయితే ఆయన పార్టీ జెండా, గుర్తు విభిన్నంగా ఉంది. అయితే ఆ గుర్తును ఆయన వివరించారు.
కనిపించే ఆరు చేతులు ఆరు రాష్ట్రాలు అని.. మధ్యలో నక్షత్రం ప్రజలుగా అభివర్ణించారు. అంటే ఆ ఆరు చేతులు దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్నాటక, పాండిచ్చేరి (కేంద్ర పాలిత ప్రాంతం) ఇలా రాష్ట్రాలు వేరైనా ప్రజలందరూ ఒకటే అనే రీతిలో నక్షత్రం అని ఆయన అర్థంగా ప్రకటించారు.
అంటే కమల్హాసన్ తాను తమిళనాడు రాష్ట్రానికే పరిమితం కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు తాను ప్రతినిధిగా ఉండాలని భావిస్తున్నారని సమాచారం. ఆయన ఆవిష్కరించిన పార్టీ పతాకంలోని గుర్తుచూస్తే మాత్రం, దానికి ఆయన ఇచ్చిన నిర్వచనం చూస్తే మాత్రం.. కొన్ని కొత్త సందేహాలు రేకెత్తుతున్నాయి. కేవలం తమిళనాడు కోసం పనిచేసే పార్టీగా మాత్రమే కాకుండా.. మొత్తం దక్షిణ భారతదేశపు కొత్త గొంతుకగా, ఉత్తరాది రాష్ట్రాల నాయకుల ఆధిపత్యాన్ని, అరాచకాన్ని ప్రశ్నించేలా కమల్ హాసన్ తన పార్టీని తీర్చిదిద్దే ఉద్దేశంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది రాష్ట్రాలు పెత్తనాలు చేస్తుంటాయి. దేశ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఢిల్లీ పెత్తనం దక్షిణాది రాష్ట్రాలపై ఉంది. కేంద్ర బడ్జెట్లో ఆ విధంగానే కేటాయింపులు ఉంటాయి. అందుకే జాతీయ పార్టీలు దక్షిణాది రాష్ట్రాల్లో అంతగా రాణించలేవు. దక్షిణాది రాష్ట్రాలు జాతీయ పార్టీలకు చుక్కలు చూపిస్తుంటాయి. అందుకే ఇప్పుడు మళ్లీ కేంద్ర పెత్తనానికి జవాబు చెప్పేలా కమల్ వచ్చారని తెలుస్తోంది.