దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకోవడం తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ నింపింది. దాంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. దానిలో భాగంగా రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ రెండో శ్రేణి అనుచర వర్గాన్ని పార్టీలో చేర్చుకోవడంలో వేగంగా అడుగులు వేస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ పోటీ ఇచ్చేందుకు అధ్యక్షుడు బండి సంజయ్ ముమ్మురంగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులపై, సీఎం కేసీఆర్పై మునుపెన్నడూ లేని రీతిలో విమర్శలు చేస్తున్నారు. కొన్నిసార్లు శృతిమించి మాట్లాడుతున్నారు.
ఇక కమలం ఎత్తులను చిత్తు చేయడానికి కారు పార్టీ కూడా అంతర్గతంగా కొన్ని మార్పులు చేయాలని యోచిస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నారు. అందుకనే గతంలో అప్పుడెప్పుడో మొదటి టర్మ్ పాలనాకాలంలో చర్చకు వచ్చిన కేటీఆర్కు సీఎం బాధ్యతలు అప్పగించే అంశం తాజాగా మళ్లీ చర్చకు వచ్చింది. కేసీఆర్ తనయుడు కేటీఆర్కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని, ఆయన సమర్థవంతమైన నాయకుడని టీఆర్ఎస్ సీనియర్ నేతలు గుత్తా సుఖేంద్రెడ్డి వంటివారు మీడియా ఎదుట అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ మంత్రిగా నిర్వహించే శాఖల్లో కనిపించే పురోగతి ఆయన గొప్ప పనితీరుకు నిదర్శనమని చెప్తున్నారు.
ఈ క్రమంలో ఊపిరితిత్తుల్లో మంటగా ఉందని సీఎం కేసీఆర్ గురువారం నాడు సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవడం హాట్ టాపిక్గా మారింది. పాలనకు సంబంధించి కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోవడం వల్లనే కేటీఆర్కు సీఎం పీఠం ముచ్చట మళ్లీ తెరపైకి వచ్చిందనే కొందరు రాజకీయ విశ్లేషకుల అంచనా! అయితే, సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని యశోద వైద్యులు చెప్తున్నారు. ఊపిరి తిత్తుల్లో కొదిగా ఇన్ఫెక్షన్ ఉందని, దానికోసం ఇప్పటికే ఆయన మెడిసిన్ వాడుతున్నారని పేర్కొన్నారు. ప్రతియేడు సాధారణ పరీక్షల కోసం వచ్చినట్టుగానే ఆయన నిన్న కూడా వచ్చారని తెలిపారు. మరోవైపు కేటీఆర్ను సీఎం చేసి, పార్టీలో ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ఆర్థిక మంత్రి హరీష్రావుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా గురుతర బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారమూ జరుగుతోంది.
అఖిలప్రియ అరెస్టు ఏపీలో అయితే… వేరేలా ఉండేది…
విజయసాయిరెడ్డి ముందే కుండబద్దలు కొట్టిన ధర్మాన!