వైఎస్ జగన్ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ఈనెల 9న ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభతో ముగుస్తుంది. ప్రస్తుతం పాదయాత్ర ఇచ్చాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. పాదయాత్రలో ప్రజలందరి సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు జననేత జగన్.
ఇచ్చాపురంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ ను ఏడు గ్రామాలకు చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తులు కలిశారు. కిడ్నీ బాధితులకు ఎలాంటి పెన్షన్లు ఇవ్వడం లేదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని జగన్తో మొరపెట్టుకున్నారు. రోగులకు సరిపడా డయాలసిస్ సెంటర్లు కూడా లేవని చెప్పారు. కిడ్నీ, తిట్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రజాప్రతినిధులు వివక్షత చూపిస్తున్నారని జగన్కు తమ గోడును వెల్లబోసుకున్నారు.
వైసీపీ అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితులకు రూ.10,000 పెన్సన్ ఇస్తామని…సరిపడా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో పాటు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. వంశధార మహేంద్రతనయ నుంచి సురక్షిత నీటిని అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు.