కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్తుల జాబితాలో కొండాసురేఖ పేరు లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఎందుకు ఇవ్వలేదో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం బీసీ మహిళను అన్న కారణంతోనే తనను అవమానించారని వ్యాఖ్యానించారు. ఇది కేవలం తననే కాకుండా రాష్ట్రంలోని బీసీలను, తెలంగాణ మహిళలు అందరినీ అవమానించినట్లేనని వెల్లడించారు.
2014లో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుకున్నాననీ, కాని టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా తమపై ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో ఒత్తిడి తీసుకొచ్చారని వెల్లడించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బస్వరాజు సారయ్యను మీరు తప్ప మరొకరు ఓడించలేరని చెప్పి తనను వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేయించారని, మంత్రి పదవి ఇస్తానని కూడా హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. పరకాల సీటు వదిలిపెట్టాల్సి వచ్చినందుకు కన్నీళ్లు పెట్టుకున్నానని ఆమె అన్నారు.
పార్టీలో చేరితే తనకు మంత్రి పదవి, తన భర్త మురళీకి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కేసీఆర్ ఆఫర్ ఇచ్చారనీ, ఆ మాటను ఇప్పటివరకూ నిలబెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. తాము వరంగల్ లో రెండు సీట్లు డిమాండ్ చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ నుంచి పొమ్మని చెప్పలేక తమకు పొగపెట్టారని ఆమె విమర్శించారు. తమ ఫోన్లు కూడా ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని మండిపడ్డారు. 105 అభ్యర్థుల జాబితా తర్వాత కేటీఆర్, హరీశ్ రావు ఫోన్ ఎత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తామిద్దరం పార్టీలోకి రావడం హరిశ్ రావుకు ఇష్టం లేదనీ, తనకు పార్టీ టికెట్ రాకపోవడానికి కారణం కేటీఆరేనని సురేఖ స్పష్టం చేశారు.
పరకాల వదిలి వరంగల్ ఈస్ట్ కు వెళ్లాలని తమకు ఇష్టం లేకపోయినా పార్టీ కోసం వెళ్లామని, వరంగల్ ప్రజలు 55,000 ఓట్ల మెజారిటీతో తనను ఆశీర్వదించారని కొండా సురేఖ తెలిపారు.అవసరం అయితే భూపాలపల్లి, పరకాల, వరంగల్ ఈస్ట్ లో తమ కుటుంబం పోటీ చేస్తుందని సురేఖ స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల్లో తనకు సమాధానం కావాలని లేకంటే తమ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని కొండాసురేఖ దంపతులు వెల్లడించారు.
మహిళా మంత్రి లేని ప్రభుత్వం ఒక్క తెలంగాణనే అని చెప్పారు. తనకు మంత్రి పదివి ఇవ్వక పోయినా కూడా ఎప్పుడు అడగలేదన్నారు. మురళీధర్ రావు ఎమ్మేల్సీ గెలుచుకుని పార్టీకి ఒక ఊపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్లు తప్ప ఎలాంటి లాభం పొందలేదన్నారు. పార్టీ అభివృద్ధి కృషి చేస్తుంటే.. నాలుగు సార్లు గెలిచిన తమ టికెట్ను ఆపడం ఏంటని ప్రశ్నించారు.