ఈటల రాజేందర్ తరఫున ప్రచారం చేస్తానంటూ చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. 2014లో టీఆర్ఎస్ ఎంపీగా గెలుపొందిన కొండా విశ్వేశ్వరెడ్డి.. ఆ తర్వాత నెలకొన్న పరిణామాల మధ్య ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేవెళ్ల ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయారు. అయితే ఆ తర్వాత కొండా విశ్వేశ్వర్రెడ్డి .. కాంగ్రెస్ మార్కు రాజకీయాలతో విసిగిపోయి.. ఆ పార్టీకి కొంతకాలం దూరంగా ఉన్నారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా సమర్పించారు. ఆయన బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఇంకా ధ్రువీకరించలేదు.
అయితే కొండా విశ్వేశ్వర్రెడ్డి.. కొంత కాలంగా ఈటల రాజేందర్కు మద్దతు తెలుపుతున్నారు. టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు విలువ లేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈటల రాజేందర్ను అవినీతి ఆరోపణలతో మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేసిన అనంతరం.. ఆయన కొండా విశ్వేశ్వర్రెడ్డిని కలుసుకున్నారు. వీరిద్దరూ కలిసి కొత్తగా ఓ రాజకీయపార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈటల అనూహ్యంగా బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ విశ్వేశ్వర్రెడ్డి ఈటలకు మద్దతుగా మాట్లాడుతున్నారు.
Also Read: టీఆర్ఎస్ లో ఎల్.రమణ చేరిక ఖాయమేనా? రేపే ప్రెస్మీట్..!
ఇదిలా ఉంటే ఆయన తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులో విలేఖరులతో మాట్లాడారు.. ‘ ఈటల రాజేందర్ను ఎలాగైనా ఓడించాలని టీఆర్ఎస్ కంకణం కట్టుకున్నది. అందుకోసం అవసరమైతే రూ. 1000 కోట్లు ఖర్చు చేసేందుకు కూడా ఆపార్టీ నేతలు వెనకాడరు. టీఆర్ఎస్ ముమ్మాటికీ కుటుంబపార్టీ. అందులో ఏ సందేహం లేదు. అక్కడంతా తండ్రి కొడుకులదే పెత్తనం. నేను ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా హరీశ్రావును చేస్తే.. నేను మళ్లీ టీఆర్ఎస్లో చేరతా.
ప్రస్తుతం నేను ఈటల రాజేందర్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. ఆయన కోసం హుజూరాబాద్ వెళ్లి ప్రచారం చేస్తా’ అంటూ విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో కేసీఆర్, కేటీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. సుస్థిరాభివృద్ధిలో ఏపీ 3వ స్థానంలో ఉండగా, తెలంగాణ మాత్రం 11వ స్థానంలో ఉందని తెలిపారు.
Also Read: టీఆర్ఎస్ కి మరో కీలక నేత రాజీనామా