హిమాచల్ప్రదేశ్కు చెందిన బిజెపి ఎంపీ రామ్ స్వరూప్ శర్మ (62) ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలో రామ్ స్వరూప్ శర్మ ఉరి వేసుకొని మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. గోమతి అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్లో ఆయన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండీ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2014లో ఆయన తొలిసారి పార్లమెంట్కు ఎన్నికయ్యారు. విదేశాంగ వ్యవహారాలకు చెందిన స్టాండింగ్ కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఎంపీ రామ్ స్వరూప్ శర్మకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన భార్య .. చార్థామ్ యాత్రలో ఉన్నట్లు తెలుస్తోంది. శర్మకు చెందిన పర్సనల్ సెక్యూర్టీ ఆఫీసర్ ప్రస్తుతం మండీలో ఉన్నారు.
తన ఫ్లాట్లో రామ్ స్వరూప్ శర్మ ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.