చంద్రబాబుపై తెలంగాణా టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరశింహులు ఫైర్ అయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన మహానాడుకు మోత్కుపల్లిని ఆహ్వానించక పోవడంపై తన ఆవేదనను వెల్లగక్కారు. నేను ఏం తప్పుచేశానో చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఈ తప్పుచేశానని చెబితే ముక్కు నేలకు రాస్తా. నన్ను మీటింగ్లకు పిలవరా, టెలీకాన్ఫరెన్స్లో నాకు లైన్ ఎందుకు ఇవ్వరంటూ అసహనం వ్యక్తం చేశారు.
తమ పార్టీలోంచి కాంగ్రెస్లోకి వెళ్లిన రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనను ఇలా చేస్తున్నారన్నారు. తనను టీడీపీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను 30 ఏళ్లుగా టీడీపీ కోసం నిజాయతీగా పని చేస్తున్నానని, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం తనతో 5 నిమిషాలు మాట్లాడడానికి కూడా ఒప్పుకోవట్లేదని, అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమాన పరుస్తున్నారని అన్నారు. తాను చంద్రబాబును నమ్మి చాలా కోల్పోయానని, దళితుడిని కాబట్టే తనను అవమాన పరుస్తున్నారని ఆరోపించారు
రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖుల వల్ల పార్టీ తెలంగాణలో నాశనమైంది. రమణను సైలెంట్ చేసి సీఎంగా నిన్న గాక మొన్న వచ్చిన రేవంత్ను ఫోకస్ చేశారు. మీ పేరు బొమ్మ లేకుండా ప్రోగ్రాం చేసినా చర్యలు ఎందుకు తీసుకోలే. ఓటుకు కోట్లులో రెడ్ హ్యాండెడ్గా మనం తయారు చేసిన నాయకుడు దొరికితే చర్యలు ఎందుకు తీసుకోలేదని’ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.
చంద్రబాబు చెబితేనే టీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్లో చేరా అంటున్నాడంట. రేవంత్ రెడ్డి పై మీకేందుకు అంత ప్రేమ, రేవంత్ను వ్యతిరేకిస్తే నన్ను దూరం పెడతావా. రేవంత్ బిడ్డ పెళ్లిలో ఎంగేజ్మెంట్కు కేబినెట్తో సహా వెళతావు. పెళ్లికి వెళుతావు, పెళ్లి ఖర్చంతా భరిస్తావు. నా బిడ్డ పెళ్లికి పిల్వంగ పిల్వంగ ఎప్పుడో సాయంత్రం వచ్చావు. నీకన్నా కేసీఆరే నయం. పెళ్లికి ముందే వచ్చాడు. పెద్ద మాదిగ అన్నావు. నిజామాబాద్లో మీ పాదయాత్ర ముందుండి నడిపించిన ఇద్దరు మాదిగ పిల్లలు ప్రమాదంలో చచ్చిపోతే పట్టించుకున్నావా. పేదోడంటే ఎందుకంత చులకన నీకంటూ మండి పడ్డారు.
ఫలానా తప్పుచేశారని చెబితే తానెంతో సంతోషిస్తానని అన్నారు. తాను చేసిన తప్పువల్ల చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ తాను చంద్రబాబు పక్షానే ఉన్నానన్నారు. తనకు అపాయింట్మెంట్ దొరికితే ఈ ప్రెస్మీట్ పెట్టే అవసరమే ఉండేది కాదన్నారు. ఇప్పటికైనా పిలిచి మాట్లాడితే తాను వచ్చేందుకు సిద్ధమని తెలిపారు. తన జీవితమంతా తెదేపాకే అంకితమిచ్చానని, నాయకుడిపై విశ్వాసంతో పనిచేశానని మోత్కుపల్లి గుర్తుచేసుకున్నారు