ఇపుడు అందరి దృష్టి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మీదే పడింది. ఏ పార్టీలో చూసినా ఈ ఉప ఎన్నిక మీదనే చర్చలు జరుపుతున్నాయి. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్కు ఉప ఎన్నిక అనివార్యమయింది. దీంతో సిట్టింగ్ స్థానం కోసం టీఆర్ఎస్, ఈ సారి ఎలాగైన గెలిచి మరోసారి గత మనుగడను చాటుకోవాలని కాంగ్రెస్, దుబ్బాక గెలిచాం, సాగర్లో కూడా సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి.
ముందంజలో టీఆర్ఎస్
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అప్పుడే నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభం అయింది. అభ్యర్థి ఎంపికపై కసరత్తు, పార్టీ ద్వితీయశ్రేణి నాయకుల మధ్య సమన్వయం, నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై దృష్టి సారించి అధికార టీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందంజలో ఉంది. నోముల సంతాప సభ పేరిట ఇప్పటికే రెండు చోట్ల సమావేశాలు ఏర్పాటు చేసింది. ఇక్కడ అభ్యర్థి ఎవరయితే బాగుంటుందన్న కోణంలో సర్వేలు కూడా పూర్తి చేసింది. మొత్తం మీద నర్సింహయ్య కుమారుడు భగత్, గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఎంసీ. కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిల అభ్యర్థిత్వాలను ఆ పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం.
సవాల్గా తీసుకున్న జానారెడ్డి
ఇక సాగర్ ఉప ఎన్నిక జానారెడ్డికి సవాల్గా మారింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్ను నాయకుడి ఉన్న జానారెడ్డి గత ఎన్నికల్లో నోముల చేతిలో ఓటమిపాలయ్యాడు. అయినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కువగా అక్కడే గడుపుతున్నారు.ఇక, నోముల మరణం తర్వాత జానా మరింత చురుకుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పార్టీ బూత్ కమిటీల సమావేశాలు ఓ దఫా పూర్తి చేసిన జానా రెండో దశలో ద్వితీయ శ్రేణి నాయకత్వంతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని, దూరంగా ఉన్న వారిని అక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తనకున్న విస్తృత పరిచయాలను ఉపయోగించుకుంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. రెండో విడతలో ఆయనకు కుమారుడు రఘువీర్ కూడా తోడయ్యారు.
దూకుడుగా కమలనాథులు
బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అయితే తాజా రాజకీయ పరిస్థితుల్లో ప్రధాన పోటీదారుల్లో ఒకరుగా నిలువడం బీజేపీకి అంత సులభమైన విషయమేమీ కాదు. గతంలో ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ పార్టీకి పెద్దగా ఓట్లు రాకపోవడంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తీవ్రంగా కష్టపడాల్సి వస్తుందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇప్పుడు అక్కడ బీజేపీ టికెట్ కోసం ఇద్దరు అభ్యర్థులు పోటీపడుతున్నారు. పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్రెడ్డి సతీమణి, గత ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదితతో పాటు కొంతకాలం క్రితం పార్టీలో చేరిన కడారి అంజయ్య యాదవ్ బీజేపీ టికెట్ను ఆశిస్తున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ లాగే సాగర్లోనూ కమలనాథులు దూకుడుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు.
ఈసీ కీలక ఆదేశాలు.. ఏపీలో పథకాలకు బ్రేక్!?
చంద్రబాబు అలా, అచ్చెన్నాయుడు ఇలా..