ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు మిత్రులుగాఉన్న పార్టీలు ఇప్పుడు బద్దశత్రువుల్లా తయారవుతున్నారు. ఇప్పటి వరకు టీడీపీకి వైసీపీ ప్రతిపక్షపార్టీగా ఉంది. కాని ఇప్పుడు జనసేన పార్టీ కూడా ప్రతిపక్షపార్టీ అయ్యింది. గుంటూరులో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ టీడీపీపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇప్పుడు జనసేన, టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.
అయితే టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ చేతుల్లో ఉన్నారనే విషయాన్ని మూడు నెలల క్రితమే చెప్పానని టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. ప్రస్తుతం వామపక్షాలు జనసేనాని వెనుక బీజేపీ ఉందనే విషయాన్ని గమనించలేకపోతున్నాయన్నారు. చంద్రబాబు తర్వాత తానే ప్రత్యామ్నాయామని పవన్ భావిస్తున్నారని, అందుకే లోకేష్పై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
పవన్ అనంతపురంనుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. పవన్ కల్యాణ్ పై మీపైనే పోటీకి రాబోతున్నారంటూ ప్రభాకర్ వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. అనంతపురం నుంచి పవన్ తనపై పోటీకి వస్తానంటే స్వాగతిస్తానన్నారు. అంతేకాకుండా ఆయనపై పోటీ చేసి తన సత్తా ఏంటో చూపిస్తానని ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యానించారు. పవన్ను చిత్తుగా ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.