ఎన్నికల సమయంలో భాజాపాలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. బీజేపీ ప్రకటించిన రెండో జాబితా… ఆ పార్టీలో చిచ్చు రాజేసింది. టికెట్లు రాని ఆశావహులు పార్టీ హైకమాండ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండో జాబితాలో నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేరును ప్రకటించడంతో… పార్టీలోని అసమ్మతి బయటపడింది.
రెండో జాబితాలో టికెట్లు రాని ఆశావహులు పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగారు. రెండో జాబితాలో నిజామాబాద్ అర్భన్ స్థానం మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణకు దక్కింది. దీంతో సూర్యనారాయణ వర్గం ఆందోళనకు దిగింది. కార్యాలయంలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. రెబెల్గా పోటీ చేస్తామని సూర్యనారాయణ వర్గం తేల్చి చెప్పింది.
మరో వైపు హైద్రాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి టిక్కెట్టును నరేష్, భాస్కర్రెడ్డిలు ఆశించారు. వీరిద్దరిని కాదని యోగానంద్కు బీజేపీ టిక్కెట్టు కేటాయించింది. దీంతో నరేష్, భాస్కర్రెడ్డిలతో పాటు మరో ముగ్గురు కార్యకర్తలు హైద్రాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం భవనంపై ఆమరణ నిరహార దీక్షకు దిగారు.
బీజేపీ రెండో జాబితాలో మొత్తం 28 మంది అభ్యర్థులను ఖరారు చేయగా అందులో ఏడుగురు రెడ్లకు, ముగ్గురు వెలమలకు, ఒక వైశ్య, ఆరుగురు బీసీలకు, 5 ఎస్టీ, 3 ఎస్సీ, 2 మైనార్టీ వర్గాలకు సీట్లు కేటాయించారు. బీజేపీ మొదటి విడతలో 38, రెండో విడతలో 28 మంది అభ్యర్థులను ఖరారు చేయగా..మిగతా 53 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక జరగాల్సి ఉంది.