- Advertisement -
నామినేషన్ల ఘట్టం ముగియడంతో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లాలోని పాలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సభలో కాంగ్రెస్, బాబుపై నిప్పులు చెరిగారు.
ఖమ్మం జిల్లాకు తలమానికంగా మారిన సీతారామ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు.. వాటిని వెనక్కి తీసుకున్న తరువాతనే ఈ గడ్డపై అడుగుపెట్టాలని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ నేతలను గెలిపించడానికి ఖమ్మం ప్రజలు గొర్రెలు కాదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, టీడీపీలు ఉన్న మహాకూటమికి ఓటేస్తే ఖమ్మం జిల్లాకు ఉరితాడు బిగించుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. ఖమ్మంకు సాగు, తాగునీరు తెచ్చే తమ ప్రయత్నం ఆగిపోతుందని హెచ్చరించారు. ప్రజలు వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఓటేయాలని కోరారు. యాభైఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఖమ్మంలో పోడు భూములు తప్ప రైతులకు ఏమీ మిగిల్చలేక పోయారని మండిపడ్డారు.
తెలంగాణ ద్రోహి అయిన టీడీపీని చైతన్యవంతులైన ఖమ్మం ప్రజలు తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఓవైపు సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. మరోవైపు టీడీపీ, కాంగ్రెస్లపై కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ ఇతరపార్టీలు ఎన్ని జిమ్మికులు చేసిన టీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జల్లాలోని ఏడు ముంపు మండలాలను నిండా ముంచుతూ పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆరోపించారు.
జిల్లాలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న సండ్ర వెంకట వీరయ్య, నామా నాగేశ్వరరావుల, మచ్చా నాగేశ్వరరావులు గెలిస్తే చంద్రబాబు వద్ద మోకరిల్లి మన ప్రాజెక్టులకు అడ్డుపడతారు. కాబట్టి ఈ కుట్రలను ఖమ్మం ప్రజలు తిప్పికొట్టాలి. వారిని ఓడిస్తేనే మన ప్రాజెక్టులు పూర్తి అవుతాయి’’ అని పేర్కొన్నారు.