పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మ గడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన ఈ- వాచ్ యాప్ వివాదస్పదమైన విషయం తెలిసిందే. అధికార వైఎస్సార్సీపీ సహా బీజేపీ ఆ యాప్పై పలు సందేహాలు వ్యక్తం చేసింది. అంతేగాక దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రేవేటు యాప్ను నమ్మలేమంటూ కొంత మంది న్యాయ వాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ యాప్కు కోర్టు బ్రేక్ వేసింది.
ఈనెల 9 వరకు సెక్యూరిటి సర్టిఫికెట్ ఇస్తేనే దీని వినియోగానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ- వాచ్పై మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ యాప్ను టీడీపీ ఆఫీసులోనే తయారు చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాదు ఈ విషయంపై ఎస్ఈసీ తరఫున న్యాయవాదులు కూడా టీడీపీ ఏర్పాటు చేసిన వారే ఆరోపణలు గుప్పించారు.
ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. నిమ్మగడ్డ తన చుట్టూ ఉన్న ఎవర్నీ నమ్మడం లేదు.మంగళగిరిలోని టీడీపీ ఆఫీసే ఆయన బ్యాక్ ఆఫీసు! ‘ఈ వాచ్’ యాప్ తయారైంది అక్కడే. లేఖలు, ఆర్డర్ కాపీల డ్రాఫ్టింగ్ అక్కడే. తన తరపున వాదించే లాయర్ల ఏర్పాటు అంతా పచ్చ పార్టీదే. ఎంత స్వామి భక్తి ఉన్నా…ఇంత బరితెగింపా? అని విజయసాయిరెడ్డి ఎస్ఈసీ తీరును విమర్శించారు.
ఇక టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను రద్దు చేస్తూ సుతిమెత్తని హెచ్చరికలు చేసిన నిమ్మగడ్డను ఉద్దేశించి.. భళా! ఏమి డ్రామాలు నిమ్మగడ్డా, నారా బాబు! నేను కొట్టినట్లు నటిస్తా – నువ్వు ఏడ్చినట్లు నటించు అన్నట్లుంది మీ యవ్వారం. సమాధానం సంతృప్తిగా లేకపోతే చర్యలు తీసుకోవాలిగానీ – టీడీపీ మ్యానిఫెస్టోను నువ్వు రద్దు చేయడమేంటయ్యా నిమ్ము! అని విజయసాయిరెడ్డి సెటైరికల్ ట్వీట్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పదవికి రాజీనామా!
అబ్బాయిలు కావాలండోయ్.. ! ఎందుకో తెలుసా?