విజయవాడ సెంట్రల్ సీటు రాజకీయాలు కృష్ణాజిల్లా వైసీపీనీ ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. ఆ సీటు మల్లాది విష్ణుకు కేటాయించడంతో అదే సీటుపై ఆశలు పెట్టుకున్న రాధా తీవ్ర నిరాశలో ఉన్నారు. దీంతో నిన్నటి నుంచి పార్టీలో హైడ్రామా నడుస్తోంది.
తాజాగా విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వైసీపీ అధిష్టానం రాధాకు షాక్ ఇచ్చనట్లు తెలుస్తోంది. సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకేనని దీనిలో ఎలాంటి మార్పులేదని పార్టీ నాయకత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో దీంతో వంగావీటి రాధా, రంగా మిత్రమిండలి కార్యకర్తలతో వంగవీటి రాధా సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకు కేటాయించేందుకు వైసీపీ నాయకత్వం పావులు కదుపుతోంది. ఇదే స్థానం నుండి పోటీ చేసేందుకు వంగవీటి రాధా మూడున్నరేళ్లుగా ప్లాన్ చేసుకొంటున్నారు. అయితే మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరారు. విష్ణుకు వైసీపీ సెంట్రల్ సెగ్మెంట్ సమన్వయకర్తగా నియమించారు. దీంతో వంగవీటి రాధా, వంగవీటి రంగా అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ సెంట్రల్ సీటు నుండి పోటీ చేసేందుకు వంగవీటి రాధా ఆసక్తిని చూపుతున్నారు. ఇదే సీటు నుండి పోటీ చేసేందుకు మల్లాది విష్ణు కూడ ఆసక్తితో ఉన్నాడు. మల్లాది విష్ణుకు ఈ సీటును కేటాయించడం వల్లే పార్టీకి ప్రయోజనం ఉంటుందని వైసీపీ భావిస్తోంది. వంగవీటి రాధాకు మచిలీపట్నం ఎంపీ సీటు లేదా ఆవనిగడ్డ లేదా విజయవాడ తూర్పు సీటును కేటాయించాలని వైసీపీ భావిస్తున్నట్టు సమాచారం. విజయవాడ సెంట్రల్ సీటును కాదని తాను వేరే స్థానం నుండి పోటీ చేయబోనని వంగవీటి రాధా పార్టీ నాయకత్వాన్ని తెగేసి చెప్పాడు.
మరో వైపు రాధా జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన నాయకులతో టచ్లో ఉన్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరి వంగవీటి రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని పార్టీలో సందిగ్ధత నెలకొంది.