జగన్ పాదయాత్రకు వస్తున్న జన సునీమీతో విశాఖ ఊగిపోయింది. ప్రజాసంకల్పయాత్రకు విశాఖ జిల్లాలో అనూహ్య స్పందన కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో వైసీపీకీ బలం లేదని వ్యాఖ్యానించిన విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ జగన్ జన సునామీని సృష్టించారు. దీంతో అధికార పార్టీనాయకుల్లో దడ మొదలయ్యింది.
ప్రత్యేకించి వైజాగ్లోని కంచరపాలెంలో ఆదివారం నాడు వైసీపీ నిర్వహించిన సభకు విపరీత స్థాయిలో జనం రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే వచ్చిన కేరాఫ్ కంచరపాలెం సినిమా హిట్ కొట్టడం… ఇదే సమయంలో కంచరపాలెం సెంటర్లో జగన్ సభ సూపర్ హిట్ కావడం రెండూ ఆసక్తిదాయకంగా మారింది.
కంచెరపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీపై, చంద్రబాబుపై మాటల తూటాలు పేల్చారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నలను జగన్ తన ప్రసంగాల్లో ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తిపై కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత విమర్శలు చేస్తున్నారు.
తనకు సంబంధం లేని భూములను బ్యాంకులో తాకట్టు పెట్టుకొని మంత్రి గంటా శ్రీనివాసరావు రుణం తీసుకొన్నాడని ఆయన ఆరోపించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ పక్కనే ఉన్న మంత్రి అయ్యన్నపాత్రుడి భూముల జోలికి సర్కార్ ఎందుకు వెళ్లలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. విశాఖలో విలువైన 9.1 ఎకరాల భూమిని లూలూ గ్రూపుకు చంద్రబాబునాయుడు అప్పనంగా అప్పజెప్పారని చెప్పారు.
భోగాపురం ఎయిర్పోర్టుకు భూ సేకరణ విషయంలో మంత్రి అయ్యన్నపాత్రుడు భూములను మినహాయించి సామాన్యుల భూములను మాత్రం లాక్కొంటున్నారని విమర్శించారు. ఇలా భూములతో వ్యాపారం చేసిన నేతలెవరూ లేరంటూ జగన్ వ్యాఖ్యానించారు.