వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. వైఎస్ జగన్ హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సమావేశమయ్యారు. మాములుగానే హోదా అంశం.. విభజన హామీలపై తాము ఎలా పోరాటం చేశాం.. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనే అంశాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా నవరత్నాల పథకాల గురించి ప్రజలకు వివరించారు. అంతేకాకుండా పొత్తులు, కేంద్ర రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్.
పొత్తులపై పలు ప్రశ్నలు ఎదురుకాగానే మరోసారి కుండబద్దలు కొట్టారు జగన్. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని… ఎవరితోనూ పొత్తులు ఉండవని ఖరాఖండిగా చెప్పారు. రాజకీయ పార్టీల మాటలు నమ్మి ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకుంటే మోసపోతామన్నారు. రాష్ట్ర ప్రజలు తమకు 25 ఎంపీ సీట్లు ఇస్తారన్నారు. ఇక కేంద్రంలో హంగ్ వస్తుందని జోస్యం చెప్పారు జగన్. హంగ్ వస్తేనే మనకు మంచిదని.. ఎవరైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి.. విభజన హామీల అమలుకు ముందుకు వస్తారో వారికే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ దెబ్బతో ప్రత్యేక హోదా వస్తుంది – రైల్వేజోన్ కూడా వస్తుందన్నారు.
అంతేగాకుండా తాము అధికారంలోకి రాగానే అమలు చేసే పథకాలను వివరించారు జగన్. తాము ప్రవేశపెట్టిన పథకాలను డోర్ డెలివరీ చేసేందుకు ప్రతీ 50 కుటుంబాలకు రూ. 5 వేల జీతంతో ఒకరిని నియమిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా ప్రభుత్వ పథకాలను మంజూరు చేస్తామని తెలిపారు. వైఎస్సార్ చేయూత ద్వారా 45 ఏళ్లు దాటిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
తాము సాధించామని గొప్పలు చెబుతున్న కియా ఫ్యాక్టరీపై చంద్రబాబుకు చురకలంటించారు జగన్. కియా ఫ్యాక్టరీ ఘనత చంద్రబాబు తీసుకున్నారు సరే.. అందులో 5 శాతం ఉద్యోగాలు కూడా స్థానికులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన… ఏర్పాటుకానున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని తొలి అసెంబ్లీ సమావేశంలోనే చట్టం తెస్తామన్నారు.
వైఎస్ఆర్సీపీ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారన్నారు. కానీ చంద్రబాబు ఎన్నికల స్టంట్లు ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా నమోదైన కేసుల ఎత్తివేతలోనూ చంద్రబాబు పక్షపాతం చూపారని అన్నారు. అధికారంలోకి రాగానే ప్రజా ఉద్యమాలు – ఆందోళనలు – ధర్నాల కారణంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని స్పష్టం చేశారు.