ఎన్నికల్లో టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలు గెలిచి సంతోషం కూడా ఇప్పుడు ఆవిరైపోతోంది. ఇప్పటికే భాజాపా అపరేషన్ ఆకర్ష్కు విలవిల్లాడుతున్న టీడీపీకీ ఇప్పుడు ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇప్పటికే పెద్దాపురం నుంచి గెలుపొందిన నిమ్మకాయల చినరాజప్ప ఎన్నిక చెల్లదంటూ అక్కడ వైసీపీ ఇంచార్జి అయినటువంటి తోట వాని హై కోర్టులో పిటిషను వేసి కలకలం రేపిన సంగతి అందరికీ తెలిసిందే.దీనికి గాను హై కోర్టు కూడా ఆమోదం తెలుపడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో మరింత దుమారం చెలరేగింది. తాజాగా తెలుగు తమ్ముళ్లకు మరో గట్టి షాక్ ఇచ్చారు వైసీపీ నేతలు.
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా కరణం బలరాంకు బిగ్షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తప్పుడు అఫిడవిట్ సమర్పించారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. కరణం బలరాం తన ఎన్నికల అఫిడవిట్ లో ఓ భార్య వివరాలనే బయటపెట్టారని ఆమంచి తెలిపారు. కానీ కరణం బలరాంకు మరో భార్య, కుమార్తె ఉన్నారనీ, ఈ విషయాన్ని దాచిపెట్టారని విమర్శించారు.
ఆయనకు నలుగురు పిల్లలు ఉంటే, ముగ్గురి పేర్లను మాత్రమే అఫిడవిట్ లో పెట్టారని దుయ్యబట్టారు. ఈ విషయమై తాను ఏపీ హైకోర్టులో ఈపీ(ఎలక్షన్ పిటిషన్) దాఖలు చేశారు. బలరాం నాలుగో సంతానంకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలను, కొన్ని పత్రాలను ఆయన మీడియాకు చూపించారు.