టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎలాంటి సంచనాలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉచిత డేటా, ఉచిత కాల్స్ ప్రకటించి చాలా మంది వినియోగదారులను సంపాదించుకుంది. అయితే జియో ఉచిత ఆఫర్స్ ఇవ్వడంతో.. ఇతర టెలికం కంపెనీలు ఏం చేయాలో అర్ధం కాక ఏదో ఒక ఆఫర్ ను ప్రకటిస్తునే ఉన్నాయి. అయితే ఇప్పుడూ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ జియోకు దిమ్మతిరిగిపోయేలా షాకిచ్చింది.
రూ. వెయ్యికే 4జీ స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్నట్లు ప్రకటించేసింది. దీంతో 4జి ఫీచర్ ఫోన్ల పోరు మొదలైంది. ఇటివలే ఉచితంగా రిలయన్స్ జియో 4జి ఫీచర్ ఫోన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో పోటీగా ఎయిర్టెల్ కూడా సరికొత్త ఫీచర్ ఫోన్ తీసుకొస్తున్నట్టు సమాచారం. జియో ఫోన్ ధర రూ.1,500 ఉండగా ఎయిర్టెల్ తన 4జి ఫోన్ని రూ.1000లకే అందించబోతోందని తెలుస్తోంది.
అయితే రిలయన్స్ జియో మాదిరిగా ఎయిర్టెల్ కూడా మూడేళ్ల తర్వాత ఈ ఫోన్ కోసం చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చివేస్తుందా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది. దాదాపు 50 కోట్ల వరకు ఉన్న ఫీచర్ మొబైల్ ఫోన్ల వినియోగదారులను 4జి సేవలవైపు మళ్లించేందుకు జియో ఈ ప్రయోగానికి తెరతీసింది. దీంతో జియో పోటీని ఎదుర్కోవాలంటే తామూ అదే వ్యూహంతో వెళ్లక తప్పదని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి.