భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అనిరుధ్ చౌదరిపై వేటే వేసేందు సీఓఏ సిద్దమైందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బీసీసీఐలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు లోధాకమిటీ సూచించిన సంస్కరణలు అమలుకోసం సుప్రీంకోర్టు ప్రత్యేకంగా నియమించిన సీఓఏ అధ్యక్షుడు వినోద్రాయ్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
బోర్డులో సంస్కరణల అమలుకి అనిరుధ్ చౌదరి చొరవ చూపకపోగా.. అడ్డుపడుతున్నాడంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వినోయ్ రాయ్ త్వరలోనే ఓ నివేదిక సమర్పించనున్నారు. ఇందులో అనిరుధ్ చౌదరిపై వేటువేయాలనేది ప్రధాన సూచనగా ఉన్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
గత ఏడాది జనవరి 2న ఇలానే బోర్డులో సంస్కరణల అమలుపై అలక్ష్యం వహించి, అసత్య ప్రమాణం చేసిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్తో పాటు కార్యదర్శి అజయ్ షిర్కేలను వారి పదవుల నుంచి సుప్రీంకోర్టు తొలగిస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే తరహా వేటు అనిరుధ్ చౌదరిపై కూడా పడనున్నట్లు తెలుస్తోంది.
బీసీసీఐలో పారదర్శకత పెంచేందుకు లోధా కమిటీ కొన్ని సంస్కరణలను సూచించింది. కానీ.. రాష్ట్ర క్రికెట్ సంఘాలు ఈ సంస్కరణల అమలుకి తొలుత ఆసక్తి కనబర్చలేదు. దీంతో పాలకుల కమిటీ.. ఆ సంఘాలకి నిధులు నిలిపివేయగా.. అవి దారిలోకి వస్తున్నాయి. అయితే బోర్డులో మాత్రం పూర్తి సంస్కరణలు జరగడంలేదు.