ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు వరల్డ్ కప్ ఫైనల్స్ చేరింది. బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఆదివారం న్యూజిలాండ్తో అమీతుమీకి సిద్దం కానుంది.
ఇక ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్ పోరు ఏకపక్షంగా సాగింది. ఆసీస్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. ఛేదనలో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్(85; 65 బంతుల్లో 9ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. రాయ్కు తోడు రూట్(40 నాటౌట్) మోర్గాన్(40 నాటౌట్), బెయిర్ స్టో(34)లు రాణించడంతో ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీయగా, కమ్మిన్స్ మరో వికెట్ దక్కించుకున్నాడు,
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 49 ఓవర్లలో 223 పరుగులకే కుప్పకూలింది. క్రిస్ వోక్స్(3/20), అదిల్ రషీద్(3/54), ఆర్చర్(2/32)లు చెలరేగడంతో ఆసీస్ విలవిల్లాడింది. అయితే స్టీవ్ స్మిత్(85; 119 బంతుల్లో 6ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడాడు. స్మిత్తో పాటు అలెక్స్ కారీ(46) గాయాన్ని లెక్క చేయకుండా జట్టు కోసం బ్యాటింగ్ చేశాడు. చివర్లో మ్యాక్స్వెల్(23), స్టార్క్(29)లు ఓ మోస్తారుగా రాణించడంతో ఇంగ్లండ్ ముందు ఆసిస్ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది.
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్తో ఇంగ్లండ్ ఫైనల్ తలపడనుంది. ఈ ప్రపంచకప్ ఎవరు గెలిచినా అది చరిత్రే అవుతుంది. ఇంగ్లాండ్ క్రికెట్ కు పుట్టినిల్లు అయినా ఇంతవరకు 50 ఓవర్ల ఫార్మాట్ లో ప్రపంచకప్ గెలిచింది లేదు. మరోవైపు, న్యూజిలాండ్ ఇప్పటికి ఎనిమిదిసార్లు సెమీస్ ఆడి, రెండు పర్యాయాలు ఫైనల్ చేరింది. ఈసారి కప్ గెలిచి వరల్డ్ కప్ విన్నర్స్ క్లబ్ లో చేరాలని ఉత్సాహపడుతోంది.