చిరస్మరనీయ విజయాన్ని భారత్ను ఊరిస్తోంది. అయితే పజయం కూడా పొంచి ఉంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (43 బ్యాటింగ్: 76 బంతుల్లో 3×4) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో 194 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 110/5తో నిలిచింది. టీమిండియా విజయానికి ఇంకా 84 పరుగులు చేయాల్సి ఉండగా.. కోహ్లితో పాటు క్రీజులో దినేశ్ కార్తీక్ (18 బ్యాటింగ్: 44 బంతుల్లో 2×4) ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్లో శతకం బాదిన కోహ్లి.. శనివారం క్రీజులో నిలవడంపైనే భారత్ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఓవర్నైట్ స్కోరు 9/1తో ఈరోజు ఆటని కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టుకి ఆరంభంలోనే అశ్విన్ షాకిచ్చాడు. ఓపెనర్ జెన్నింగ్స్ (8)ని అద్భుతమైన డెలివరీతో బోల్తా కొట్టించిన అశ్విన్.. ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ జో రూట్ (14)ని కూడా పెవిలియన్ బాట పట్టించాడు. అనంతరం బౌలింగ్కి వచ్చిన ఇషాంత్ శర్మ.. ఓవర్ల వ్యవధిలో వరుసగా డేవిడ్ మలాన్ (20), జానీ బెయిర్స్టో (28), బెన్స్టోక్స్ (6), జోస్ బట్లర్ (1)లను ఔట్ చేశాడు. చివర్లో ఉమేశ్ యాదవ్.. క్రీజులో ఒంటరి పోరాటం చేస్తున్న కుర్రాన్ని ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది.
జట్టు కోహ్లీ మాత్రం దృఢంగా నిలిచి, ఇంగ్లీష్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. జట్టును విజయం దిశగా నడిపించే బాధ్యతను తన భుజానపై వేసుకున్నాడు. కోహ్లీకి తోడుగా దినేష్ కార్తీక్ క్రీజులో ఉండగా, నేడు మరో 84 పరుగులు చేస్తే భారత్ విజయం సాధిస్తుంది. కోహ్లీ క్రీజులో ఉన్నంతవరకూ విజయంపై ఆశలు బతికున్నట్టే. ఎటొచ్చీ ఇతర బ్యాట్స్ మన్లు కోహ్లీకి ఎంతవరకూ సహకరిస్తారన్నదే ప్రశ్న.