సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారత్కు భారీ టార్గెట్ విధించింది. పటిష్ట స్థితిలో నిలిచి తమ రెండో ఇన్నింగ్స్ను 312/6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని కలుపుకుని ప్రత్యర్థి జట్టుకు 407 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగో రోజు ఆటలో భాగంగా తమ రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ క్రికెటర్లు లబుషేన్ (73), స్టీవ్ స్మిత్(81), కామెరూన్ గ్రీన్(84)లు అర్థ శతకాలతో సత్తా చాటగా కెప్టెన్ టిమ్ పైన్(39 నాటౌట్) రాణించాడు. 103/2 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆసీస్.. ఈ మేరకు స్కోరు నమోదు చేసింది.
ఇక టీమిండియా బౌలర్లలో అరంగేట్ర బౌలర్ నవదీప్ సైనీ, సీనియర్ ఆటగాడు అశ్విన్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక బుమ్రా, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ టీమిండియా 338 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 244 పరుగులకు మొదటి ఇన్నింగ్స్ ముగించిన సంగతి తెలిసిందే.
మిడిలార్డర్ మెరుగ్గా రాణిస్తేనే..
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో 250కి పైగా లక్ష్యాన్ని సాధించడమే ఒక విధంగా కష్టతరమని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఆతిథ్య జట్టు 400కు పైగా టార్గెట్ విధించింది. ఇంకా మిగిలిన నాలుగు సెషన్లలో సుమారు 138 ఓవర్లు మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా టీమిండియాకు గెలుపు కష్టంగానే కనిపిస్తోంది. మిడిలార్డర్ మెరుగ్గా రాణిస్తే తప్ప కొండంత లక్ష్యాన్ని ఛేదించి కనీసం డ్రా చేసే అవకాశం ఉంది. ఇక తొలి ఇన్నింగ్స్లో ఆకట్టుకున్న ఓపెనర్ శుభ్మన్ గిల్(31) హాజల్వుడ్ బౌలింగ్లో పైన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ, పుజారా ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. స్కోరు 87/1 (29.2 ఓవర్లు) ఉంది.
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్కు చేదు అనుభవం
త్వరగా కూల్చకపోతే సిడ్నీలో గండమే!