సెంచూరియన్లో జరిగిన రెండో టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్ను మణికట్టు స్పిన్ ద్వయం యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ కకావికలం చేశారు. స్వల్ప పరుగుల తేడాతోనే బ్యాట్స్మెన్ను పెవిలియన్కు పంపించేశారు. సఫారీ జట్టును తమ సొంతగడ్డపైనే తొలిసారి అత్యంత తక్కువ స్కోరు 118కి ఆలౌట్ చేశారు. చాహల్ అయితే తన అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించాడు. అంతేకాదు దక్షిణాఫ్రికాలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా అవతరించాడు. తన బౌలింగ్పై చావల్ స్పదించాడు.
ప్లైటెడ్ డెలివరీలు వేస్తే బ్యాట్స్మెన్ సిక్స్ కొట్టే అవకాశం ఉన్నా.. తాను అవే బంతుల్ని సంధిస్తానని స్పిన్నర్ చాహల్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేసిన చాహల్ 22 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆ జట్టు 32.3 ఓవర్లలోనే 118 పరుగులకి కుప్పకూలిపోగా.. లక్ష్యాన్ని భారత్ అలవోకగా 20.3 ఓవర్లలోనే ఛేదించేసి ఆరు వన్డేల సిరీస్లో 2-0తో ఆధిక్యం సాధించింది.
కెరీర్లో బెస్ట్ (5/22) బౌలింగ్ గణాంకాలు నమోదు చేయడంపై చాహల్ మీడియాతో స్పందించాడు. ‘బ్యాట్స్మెన్ నా బౌలింగ్లో పరుగులు చేస్తున్నాడే..? అనే కంగారు నాలో ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే.. ప్రతి మ్యాచ్లోనూ నేను వికెట్ల కోసం ప్రయత్నిస్తానే తప్ప.. పరుగులు నియంత్రించాలని కాదు. అందుకే ఎక్కువగా ప్లైటెడ్ డెలివరీలను విసురుతుంటా. ఈ బంతిని బ్యాట్స్మెన్ అలవోకగా సిక్స్ కొట్టేయగలడు. కానీ.. అలా భయపడితే వికెట్లు తీయలేం. అందుకే మొండిగా ముందుకు వెళ్లిపోతున్నా’ అని చాహల్ వివరించాడు.