భారత్, వెస్డిండీస్ మధ్య వన్డే సిరీస్కు వేదికల సమస్య పట్టుకున్నట్టుంది. ఇప్పటికే ఇండోర్లో జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ను కాంప్లిమెంటరీ పాస్ల గొడవ కారణంగా విశాఖకు మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వాఖేండేలో జరగాల్సిన నాలుగో వన్డే వేదకను కూడా మార్పు చేశారు బీసీసీఐ అధికారులు.
భారత్- విండీస్ మధ్య అక్టోబర్ 29న వాంఖడే స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) స్టేడియానికి మారుస్తూ ప్రకటన విడుదల చేసింది బీసీసీఐ. ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధికారుల పదవీ కాలం ముగియడంతో టెండర్లు పిలిచేందుకు అవకాశం లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
వన్డే మ్యాచ్ నిర్వహణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ఎంసీఏ అధికారులతో బీసీసీఐ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంసీఏ అధికారులు మ్యాచ్ నిర్వహణ కష్టమని… చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎంసీఏ పాలన కోసం ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులను నియమించింది ముంబై హైకోర్టు. వీరి పదవీకాలం కూడా ముగియడంతో ప్రస్తుత పాలనా అధికారులెవ్వరూ లేరు. దాంతో ఎంసీఏ బ్యాంకు ఖాతాను ఎవరు నిర్వహించాలనే దానిపై స్పష్టత లేదు. దాంతో వన్డే మ్యాచ్ నిర్వహణ కోసం టెండర్లు పిలిచేందుకు కూడా ప్రస్తుత అధికారులకు అధికారం లేదు. దాంతో వాంఖడే స్టేడియంలో సమీపంలోనే బ్రబౌర్న్ (క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా)కు వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.