గతేడాది భారత క్రికెటర్ల ఫిట్నెస్ టెస్టులో భాగంగా యో-యో టెస్టును బీసీసీఐ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో యో-యో ఫిట్నెస్ టెస్టును నిర్వహించేందుకు ఫ్రాంచైజీలు సమాయత్తమవుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరో ఐదు రోజుల్లో ప్రారంభంకాబోతోంది. సుమారు నెలన్నరపాటు జరగనున్న ఈ టోర్నీ కోసం అన్ని జట్లూ తమ ఆటగాళ్లకి ‘యో-యో’ ఫిటెనెస్ టెస్టుని నిర్వహిస్తున్నాయట. టీమిండియా తరహాలో ఈ యో-యో ఫిటెనెస్ టెస్టులో పాసైన వారికే తుది జట్టులో చోటివ్వాలని ఫ్రాంఛైజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
టోర్నీలో ముంబయి ఇండియన్స్ ఇప్పటికే తమ ఆటగాళ్లకి ఈ పరీక్షలు నిర్వహించగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ ఇదే బాటలో ఉన్నాయట. భారత జట్టులో స్థానం కోల్పోయిన ఆటగాడు తిరిగి జట్టులోకి పునరాగమం చేయాలనుకుంటే యో-యో టెస్టు పాసవడం తప్పనిసరిగా చేశారు. గత ఏడాది మార్చిలో అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే ఈ నియమం తీసుకురాగా.. జట్టు ప్రదర్శన మెరుగవడంతో కొనసాగిస్తున్నారు.