ధోనిపై నెటిజన్ల ప్రశంసల వర్షం
పద్మ పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం (ఏప్రిల్ 2) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వేడుకగా జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. అయితే ఈ అవార్డుల ప్రదానోత్సవంలో భారత క్రికెట్ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని అందర్నీ ఆశ్చర్యపరిచి ప్రశంసలు అందుకున్నాడు. సైనిక దుస్తుల్లో కార్యక్రమానికి హాజరై ధోని రాష్ట్రపతిని, అతిథులను, సభికులను ఆశ్చర్యపరిచాడు.
అవార్డు స్వీకరించేందుకు వెళ్లే క్రమంలో అతడు ఆర్మీ వ్యక్తిలా నడిచి వెళ్లి కోవింద్కు సెల్యూట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఈ కార్యక్రమానికి ధోనీతో పాటు అతడి భార్య సాక్షి కూడా హాజరయ్యారు. ఏడేళ్ల కిందట (ఏప్రిల్ 2, 2011) వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంకపై సిక్సర్ బాది భారత జట్టుకు ప్రపంచ కప్ అందించాడు. ఇప్పుడు మళ్లీ అదే తేదీన ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు ధోని స్వీకరించడం విశేషం. ప్రపంచకప్ విజయం తర్వాత ధోనీకి ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా దక్కడంతో సైనిక్ దుస్తుల్లో ధోని పాల్గొన్నాడు.
రెండు ఆసియా గేమ్స్ (2006, 2010)లలో భారత్కు బంగారు పతకాలు అందించడంతోపాటు కెరీర్లో మొత్తం 19 సార్లు వివిధ ఫార్మాట్లలో ప్రపంచ టైటిల్స్ నెగ్గిన క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీకి కూడా రాష్ట్రపతి ‘పద్మభూషణ్’ అవార్డు అందజేశారు.