క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రాజ్యసభ ఎంపీగా తాను అందుకున్న పూర్తి జీతాన్ని, అలవెన్స్లను ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కు అందజేశారు. ఇటీవలె సచిన్ రాజ్యసభ ఎంపీ పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఆరేళ్లుగా సచిన్ ఎంపీగా అలవెన్స్లతో కలిపి సుమారు రూ. 90 లక్షలు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని పీఎం రీలీఫ్ ఫండ్కు అందజేసినట్లు పీఎంవో వర్గాలు తెలిపాయి.
2012 ఏప్రిల్లో సచిన్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సమావేశాలకు సక్రమంగా హాజరుకాకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన హాజరు శాతం కూడా చాలా తక్కువగా ఉందని పలువురు విమర్శలు చేశారు. అయితే.. సచిన్ తన ఎంపీ లాడ్స్ నిధులను మాత్రం సక్రమంగా వినియోగించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
సచిన్ ఆఫీస్ పేర్కొన్న వివరాల ప్రకారం తన రూ.30 కోట్ల ఎంపీ ల్యాడ్స్ను దేశ వ్యాప్తంగా 185 ప్రాజెక్టులకు ఉపయోగించారు. సుమారు రూ.7.5 కోట్లు విద్యా సంబంధిత అభివృద్ది కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ఇక సచిన్ ఆదర్శ్ గ్రామ యోజన కింద రెండు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. వీటిలో ఆంధ్రప్రదేశ్లో ఓ గ్రామం ఉండగా మరొకటి మహారాష్ట్రలో ఉంది.