శిఖర్ ధావన్… భారత జట్టులో ఏకైక ఎడమచేతి వాటం స్పెషలిస్ట్ బ్యాట్స్మన్. మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ సభ్యుడు. కేఎల్ రాహుల్ వంటి ప్రతిభావంతుడిని కాదని మరీ అవకాశాలు దక్కించుకుంటున్న ఆటగాడు. అయితే, టి20లు, వన్డేల వరకైతే ఉపయుక్తమైన వాడే. టెస్టుల్లోకి వచ్చేసరికే అతడి ప్రదర్శన విమర్శకులకు పని కల్పిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో అసలు ధావన్ అవసరం ఉందా? అనిపిస్తోంది. తాజాగా ఎస్సెక్స్ వంటి కౌంటీ జట్టుపై సన్నాహక మ్యాచ్లోనే శిఖర్ ‘పెయిర్’ సాధించాడు.
మొదటి ఇన్నింగ్స్లో మూడు బంతులు ఆడి డకౌట్గా వెనుదిరిగిన అతను… రెండో ఇన్నింగ్స్లో మొదటి బంతికే వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో తొలి టెస్టులో ధావన్ను ఆడించాలా వద్దా అని జట్టు మేనేజ్మెంట్ ఆలోచిస్తుందనడంలో సందేహం లేదు. అతనితో పోలిస్తే రాహుల్ మెరుగ్గా ఆడుతుండటం, విజయ్ విదేశీ రికార్డు మెరుగ్గా ఉండటం కూడా ధావన్కు స్థానంపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి.