టీమిండియా హెడ్ కోచ్ పదవికి అటు విదేశీ మాజీలు, ఇటు భారత మాజీ క్రికెటర్లు కోచ్ పదవుల కోసం పోటీలో ఉన్నారు. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగిసినా విండీస్ టూర్ ఉండటంతో 45 రోజులు పొడిగించారు. ఇటీవల కోచింగ్ స్టాఫ్ దరఖాస్తుల తేదీ ముగియడంతో ఇక ఎంపిక ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది.
ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ టామ్ మూడీతో పాటు కింగ్స్ పంజాబ్ కోచ్, న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సెన్, గ్యారీ క్రిష్టెన్ లు ప్రధాన కోచ్ పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారు. స్వదేశంనుంచి రాబిన్ సింగ్, లాల్చంద్ రాజ్పుత్లు కోచ్ పదవి కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
ఇదలా ఉంటే తాజాగా కోచ్ పదవిని చేపట్టడంపై మాజీ కెప్టెన్ గంగూలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా హెడ్ కోచ్ కోసం భవిష్యత్లో మీరూ పోటీపడతారా..? అని గంగూలీని ప్రశ్నించగా అతను సమాధానమిచ్చాడు. ‘కచ్చితంగా.. నాకు కూడా కోచ్గా పనిచేయాలని ఉంది. కానీ.. ఇప్పుడు కాదు.. ఈసారి మళ్లీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రయత్నిస్తా. ఎందుకంటే.. ప్రస్తుతం నాకు చాలా బాధ్యతలు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఐపీఎల్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్), టీవీ కామెంటరీ ఇలా పలు వ్యవహారాలు నా ముందు ఉన్నాయి. వీటిని పూర్తి చేసిన తర్వాత నేను కూడా రేసులోకి వస్తా. ఏదొక సమయంలో భారత క్రికెట్ కోచ్ పదవిని అలంకరిస్తా’ అని గంగూలీ తెలిపాడు.