శ్రీలకంతో చివరి మూడో టెస్ట్ ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శనివారం ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా 1-0తో ముందంజలో ఉంది. నాగ్పూర్ టెస్టులో భారీ ఆధిక్యంలో నెగ్గిన టీమిండియా.. చివరి టెస్టును కూడా తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. అయితే ఓపెనర్ల విషయంలో కెప్టెన్ విరాట్కు చిక్కొచ్చి పడింది.
కోల్కతా టెస్టులో కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేశారు. వీరిద్దరూ తొలి ఇన్నింగ్స్లో ఆకట్టుకోలేక పోయారు. కానీ రెండో ఇన్నింగ్స్లో రాహుల్ 79 పరుగులు చేయగా, ధావన్ 94 రన్స్ వద్ద అవుటై కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వ్యక్తిగత కారణాల రీత్యా నాగ్పూర్ టెస్టుకు ధావన్ దూరం కావడంతో.. అతడి స్థానంలో ఓపెనర్గా వచ్చిన మురళీ విజయ్ 128 పరుగులు చేసి రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
మూడో టెస్టు మ్యాచ్కు ముందే ధావన్ తిరిగి జట్టుతో చేరాడు. దీంతో రాహుల్, ధావన్, విజయ్లలో ఓపెనర్లుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయం కోహ్లికి పెద్ద తల నొప్పిగా మారింది. వచ్చే ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో కోహ్లి సేన పర్యటించనుంది. ఇలాంటి నేపథ్యంలో ఓపెనర్లుగా కోహ్లి ఎవరికీ ప్రాధాన్యం ఇస్తాడనే విషయం కీలకం కానుంది.
జట్టు విజయాల్లోనూ ఓపెనర్ల ఎంపిక కూడా కీలక పాత్ర పోషించనుంది. తనతోపాటు ఐపీఎల్ ఆడే రాహుల్, ఢిల్లీకే చెందిన ధావన్కు విరాట్ ఓపెనింగ్ ఛాన్స్ ఇస్తాడా..? లేదంటే విజయ్కు అవకాశం ఇస్తాడా..? కెప్టెన్గా కోహ్లి ఏంటనేది తను తీసుకోబోయే నిర్ణయమే డిసైడ్ చేయనుంది. మరి కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.
టీమిండియా జట్టు…
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, చెటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, వృద్ధిమాన్ సాహ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మొహమ్మద్ షామి, విజయ్ శంకర్, కుల్దీప్ యాదవ్.
శ్రీలంక జట్టు….
దినేష్ చిండిమల్ (కెప్టెన్), డిముత్ కరుణరాత్నే, సడేరా సమరావిక్మరా, లాహిరు తిరమన్నే, నిరోషాన్ డిక్వెల్లా, ఏంజెలో మాథ్యూస్, దిల్రువాన్ పెరెరా, జేఫ్ఫెరీ వెండెర్సే, రోషన్ సిల్వా, దషన్ షానకా, సురంగ లక్మల్, లాహిరు గమేజ్, లక్ష్సన్ సాందాణన్, ధనంజయ డి సిల్వా.