ఏపీ సీఎం చంద్రబాబు అనైతిక పాలన చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సి. రామచంద్రయ్య విమర్శించారు. తన సొంత అవసరాలకు ప్రజాధనాన్ని మంచి నీళ్లలా ఖర్చు పెడుతునారని చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తప్పుపట్టారు. తన పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకుని మంత్రి పదవులు ఇవ్వడంపై.. జగన్ ఢిలీ వేల్లి ఫిర్యాదు చేయడంలో అసలు తప్పు లేదన్నారు.
ఈ విషయంపై జగన్ ను విమర్శించడం దారుణం అని మండిపడ్డారు. చంద్రబాబు అక్రమాలు చేసి.. నాయకుడిగా ఎదిగారని.. జగన్ మాత్రం సొంత ప్రజాభిమానంతో నాయకుడిగా ఎదిగారని అన్నారు. ప్రజల్లో చంద్రబాబు కంటే జగన్ కే ఎక్కువ ప్రజాభిమానం ఉందని.. అందుకే జగన్ తన పార్టీ తరపున 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగారన్నారు.
జగన్పై కేసులన్నీ ఆరోపణలతో కూడుకున్నవేనన్నారు. ఇక చంద్రబాబు మాత్రం తనపై ఉన్న కేసులన్నింటికి స్టేలు తెచ్చుకున్నారని అన్నారు. కేసులపై విచారణ జరగకుండానే.. స్టేలు తెచ్చుకున్న చంద్రబాబుకు.. ఇతర రాజకీయ నాయకులపై విమర్శలు చేసే అర్హత ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రక్కన మొత్తం ఆర్థిక నేరగాళ్లే ఉన్నారని రామచంద్రయ్య అన్నారు. బ్యాంకులకు డబ్బులు ఎగొట్టిన వ్యక్తులకు బాబు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. ఈ మూడేళ్లలో చంద్రబాబు ఒక్క మంచి పనైనా చేశారా అని రామచంద్రయ్య ప్రశ్నించారు.