కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఆయన రూటే సపరేట్ అని చెప్పవచ్చు. కొంత మంది ఆయనను నియంతలా.. మరికొంత మంది సమర్థపాలకుడిగా కీర్తిస్తారు.. విమర్శిస్తారు. తెలంగాణ ఏర్పాడ్డాక రెండో సారి కూడా అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్ ఇప్పటివరకు మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసిన వారు పెద్దగా ఏమీ చేసేది ఉండదని కొందరి మాట. దానిని అలా ఉంచితే… అలంకార ప్రాయానికైనా కుర్చిల్లో మనుషులు ఉండాలి కదా అంటున్నారు రాజకీయ నేతలు.
కేసీఆర్ తన మంత్రివర్గాన్ని పూర్తిగా ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదో ఎవరికీ తెలియదు. దానికితోడు ఆయన మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకుంటారన్న విషయం కూడా బయటకు పొక్కడం లేదు. సాధారణంగా ఏ విషయమైన మూడో వ్యక్తికి తెలిస్తే ప్రపంచానికి తెలిసినట్టే అంటారు. కానీ అటు తెలంగాణ భవన్ నుంచి ఏ చిన్న సమాచారం కూడా బయటకుపొక్కడం లేదు. కారణం మంత్రివర్గ కూర్పు బాధ్యతను స్వయంగా కేసీఆరే తీసుకున్నాడని వినిపిస్తోంది.
ఇప్పుడాయన మదిలో ఏముందనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిపోయింది కారు పార్టీ నేతలకు. దీంతో ఆశావాహులంతా ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఇక గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన కడియం శ్రీహరి, హోంమంత్రిగా పని చేసిన నాయిని నరసింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వంటి సీనియర్లకు ఈసారి మంత్రిమండలిలో స్థానం లభిస్తుందా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. మరో వారం రోజుల వరకూ ఇదే సస్పెన్స్ కొనసాగే అవకాశం లేకపోలేదు. ఈ నెల 17న శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం కోసం శాసనసభ సమావేశం కాబోతుంది. 17న ఏకాదశి, 19న త్రయోదశి కావడంతో ఈ రెండు రోజులు మంచి ముహూర్తాలు ఉన్నాయి. శాసనసభ మొదటి రోజు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమమే ఉండటంతో 19న త్రయోదశి శుభముహుర్తం రోజున మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్లో విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇక త్వరలోనే లోక్సభ ఎన్నికలు ఉండటంతో.. అవి ముగిసిన తర్వాతనే పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మరో వాదన. ప్రస్తుతం మరో 16 మందికి మంత్రివర్గంలో అవకాశం ఉంది. మంత్రి పదవులకు సమానమైన హోదా కలిగిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ మూడు పదవులు కూడా మంత్రిమండలితో పాటు భర్తీ కావాల్సి ఉంది. సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా నుంచి, హోంమంత్రి మహమూద్ అలీ హైదరాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఉమ్మడి 10 జిల్లాల్లో రెండు జిల్లాలకు ఇప్పటికే మంత్రిమండలిలో ప్రాతినిథ్యం లభించింది. మిగిలిన 8 ఉమ్మడి జిల్లాల నుంచి జిల్లాకు ఇద్దరి చొప్పున అవకాశం కల్పించినా సరిపడ సంఖ్యలో 16 ఖాళీలు ఉన్నాయి.
ఏదేమైనా మంత్రివర్గ విస్తరణ ముహుర్తమెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు గులాబీ పార్టీ నేతలు.