ఉత్తరాంధ్రలో కీలక నియోజకవర్గం విజయనగరం. వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తుండగా టీడీపీ నుండి కలిశెట్టి అప్పలనాయుడు బరిలో ఉన్నారు. అయితే విజయనగరం ఎంపీ స్థానం విషయానికొస్తే ఓసారి గెలిచిన అభ్యర్థి మరోసారి గెలవలేదు.
2009లో విజయనగరం పార్లమెంట్ స్థానం ఏర్పడగా 2009లో బొత్స ఝాన్సీలక్ష్మి, 2014లో అశోక్ గజపతిరాజు, 2014లో బెల్లాన చంద్రశేఖర్ విజయం సాధించారు. గత ఐదేళ్లుగా ఎంపీగా ఉన్న బెల్లానపై ఎలాంటి వ్యతిరేకత లేదు. ఎమ్మెల్యేలందరితో సఖ్యత, మంత్రి బొత్స ఆశీస్సులతో రెండోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో అశోక్ గజపతిరాజును ఓడించి వార్తల్లో నిలిచారు బెల్లాన. సీనియర్ నేతను ఓడించి తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఏడు చోట్ల వైసీపీ అభ్యర్థులే గెలిచారు. జగన్ చేపట్టిన అభివృద్ధితో పాటు అన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటం తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.
ఇక టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అనూహ్యంగా టికెట్ దక్కించుకుని గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నారు. వాస్తవానికి ఎచ్చెర్ల టికెట్ ఆశీంచిన కలిశెట్టికి నిరాశ ఎదురుకావడంతో ఆయన్ని బుజ్జగించి ఎంపీగా నిలబెట్టారు చంద్రబాబు. కేవలం ఎచ్చెర్ల ప్రజలకు మాత్రమే కలిశెట్టి సుపరిచితుడు కాగా మిగిలిన నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలతో పరిచయాలు పెంచుకోవడం సవాల్గా మారుతోంది. దీనికితోడు కళావెంకటరావుతో విభేదాలు, గజపతినగరం నియోజకవర్గంలో పార్టీలో అంతర్గత విభేదాలు ఆయనకు తలనొప్పిగా మారాయి. మొత్తంగా విజయనగరం ఎంపీగా గెలిచేది ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది.